Tirupati: తుమ్మ‌ల‌గుంట‌లో హై టెన్ష‌న్..!

Tirupati: తిరుప‌తి రూర‌ల్ ప్రాంతమైన తుమ్మ‌ల‌గుంట‌లో హై టెన్ష‌న్ నెల‌కొంది. మ‌ఠం భూములు అంటూ నివాసుల‌ను ఖాళీ చేయించేందుకు హ‌థీరాంజీ మ‌ఠం ఉద్యోగులు, పోలీసులు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అందుకు స్థానికులు ఒప్పుకోలేదు. పాతికేళ్లుగా ఇక్క‌డే నివాసం ఉంటున్నామ‌ని మొర పెట్టుకున్నారు. వారికి చంద్ర‌గిరి తెలుగు దేశం పార్టీ నాయ‌కుడు పులివ‌ర్తి నాని భార్య సుధారెడ్డి మ‌ద్ద‌తుగా నిలిచారు. పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. ఆమెను అక్క‌డి నుంచి పంపించేసిన పోలీసులు జేసీబీ సాయంతో స్థానిక ఇళ్ల‌ను కూల్చేసారు. ఇళ్లు క‌ట్టుకునేట‌ప్పుడు లేని అడ్డంకులు ఇప్పుడెందుకు వ‌చ్చాయ‌ని స్థానికులు వాపోయారు. పెద్ద పెద్ద మేడ‌లు క‌ట్టుకోలేద‌ని ఏదో చిన్న ఇల్లు క‌ట్టుకుని బ‌తుకుతుంటే వాటిని ఎలా కూల‌గొడ‌తారంటూ ఆడ‌వారు బోరున విల‌పించారు.