Atchannaidu: కోడిగుడ్లు విస‌ర‌డం.. కోడిక‌త్తితో పొడ‌వ‌టం వారికి అల‌వాటే

Kadapa: కోడిగుడ్ల‌తో దాడిచేయ‌డం, కోడి క‌త్తితో పొడ‌వ‌టం YCPకి అల‌వాటేన‌ని అన్నారు TDP చీఫ్ కింజ‌ర‌పు అచ్చెన్నాయుడు (atchannaidu) . యువ‌గ‌ళం (yuvagalam) పేరిట నారా లోకేష్ (nara lokesh) పాద‌యాత్ర చేప‌డుతూ క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. గురువారం లోకేశ్‌పై ఓ వ్య‌క్తి కోడిగుడ్డుతో దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.  కొత్తపల్లి రిలయన్స్‌ పెట్రోలుబంకు సమీపంలోని ఓ దుకాణంలో బజ్జీలు తిని డబ్బులు ఇస్తుండగా ఓ వ్యక్తి లోకేశ్‌పై గుడ్డు విసిరారు. అది బద్వేలు TDP నేత రితీశ్‌కుమార్‌రెడ్డిని, లోకేశ్‌ను తాకి అంగడి యజమానిపై పడింది. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే అతడిని టీడీపీ కార్యకర్తలు చితకబాదారు.

అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై సీఐ రాజారెడ్డిని లోకేశ్‌ ప్రశ్నించారు. మాపై దాడులు జరిగితే ఏం చేస్తున్నారని అడిగారు.  ఫ్లెక్సీలు చించారంటూ సీఐ రాజారెడ్డి మాట్లాడడంతో లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాదయాత్రకు అనుమతి తీసుకున్నాం. మూడ్రోజులుగా వైసీపీవారే రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడుతుంటే మీరేం చేస్తున్నారు? భద్రత కల్పించాల్సింది పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? మీ కథ తేలుస్తా’ అని హెచ్చరించారు. తర్వాత కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్‌ అక్కడే కాసేపు బైఠాయించి రాత్రి 10.30 గంటలకు విడిది కేంద్రానికి చేరుకున్నారు.

ఈ ఘటనపై అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోడి గుడ్లు విసరడం.. కోడి కత్తితో పొడవడం YCP పేటీఎం బ్యాచ్‌కు అలవాటేనని అన్నారు. యువగళం పాదయాత్ర జన ప్రభంజనం చూసి జగన్‌కు సెంట్రల్ ఏసీలో ఉన్నా చెమటలు పడుతున్నాయన్నారు. అందుకే అల్లరి మూకల్ని రెచ్చగొట్టి పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. లోకేష్‌పై కోడిగుడ్లు విసిరిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.