Jagan: సెప్టెంబర్‌ నుంచి అక్కడే కాపురం!

srikakulam:  జిల్లాలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి(ys jagan) ఇవాళ పర్యటించారు. ఈ సందర్బంగా మరోసారి రాజధాని అంశం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి విశాఖ(vizag capital) నుంచే పరిపాలన సాగిస్తామని.. తాను కూడా కాపురం ఇక్కడే పెడతానని సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. అయితే గతంలో ఈ ఏడాడి జూన్‌, జులై నుంచి పరిపాలన సాగిస్తామని జగన్‌ చెప్పగా.. మరోసారి తేదీని మార్పు చేశారు. ఇదైనా ఫైనల్‌ అవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే అమరావతి రాజధాని కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆ తీర్పు తర్వాత వైసీపీ ప్రభుత్వం రాజధాని అంశంలో నిర్ణయం తీసుకోలేదు. ఇక ఇవాళ సీఎం జగన్‌.. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు(Greenfield Mulapeta Port) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మూలపేటలో రూ. 4,362 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 23.5 మలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు. 30 నెలల్లో ఈ పనులను పూర్తి చేయనున్నట్లు జగన్‌ తెలిపారు. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సరకుల రవాణా మరింత సులభం కానుంది. ఈ పోర్టు ద్వారా సుమారు 35 వేల మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్‌ అన్నారు.

ఇక మూలపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. “మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. మిగిలిన వారు అంతా ఏకమై నాతో చీకటి యుద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో పెత్తందార్లు, పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారు. వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. అని సీఎం తెలిపారు.