Jagan పై దాడి చేసిన ఆ న‌లుగురు ఎవ‌రు?

Jagan: శ‌నివారం రాత్రి విజ‌య‌వాడ‌లో జ‌గ‌న్ మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) రాళ్ల దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో జ‌గ‌న్ ఎడమ కంటిపై భాగంలో కాస్త పెద్ద గాయమే అయ్యింది. రాయి ఇంకాస్త కింద‌కి తగిలి ఉంటే క‌న్ను పోయేదే అని వైద్యులు తెలిపారు. అయితే ఈ దాడికి పాల్ప‌డింది తెలుగు దేశం పార్టీ నేత‌లే అని వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు.. కాదు ఇది మ‌రో కోడి క‌త్తి డ్రామా అని తెలుగు దేశం పార్టీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు.

అయితే జ‌గ‌న్‌పై దాడికి పాల్ప‌డింది న‌లుగురు వ్య‌క్తులు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్ర‌స్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా దాదాపు 40 మంది అనుమానితుల్ని పోలీసులు విచారించారు. జ‌గ‌న్ బ‌స్సుపై నిల‌బ‌డి ఉన్న ప్ర‌దేశం ఎదురుగా ఉన్న గుడి ప్రాంగ‌ణం నుంచి రాళ్లు రువ్విన‌ట్లు సీసీటీవీ ద్వారా తెలిసింది. దాదాపు 24 సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఎయిర్ గ‌న్నుతో దాడి చేస్తారా లేక క్యాట్ బాల్‌తోనా అనే దానిపై విచార‌ణ జ‌రుగుతోంది. అనుమానితుల్ని విజ‌య‌వాడ‌లోనే ఉంచి విచార‌ణ చేస్తున్నారు.