Parliament Attack ర‌చ్చ వెనకున్న ఉద్దేశం ఏంటి.. నిందితులు ఏం చెప్పారు?

Parliament Attack: నిన్న పార్ల‌మెంట్‌లో లోక్ స‌భ స‌మావేశాలు జరుగుతుంటే ఇద్ద‌రు ఆక‌తాయిలు చొచ్చుకొచ్చి నానా హంగామా చేసిన సంగ‌తి తెలిసిందే. రంగుల క్యాన్‌లు తీసుకొచ్చి పార్ల‌మెంట్ అంతా చ‌ల్లి ర‌చ్చ ర‌చ్చ చేసారు. కొందరు ఎంపీలు వారిని ప‌ట్టుకునేందుకు ధైర్యం చేస్తే మ‌రికొంద‌రు భ‌యాందోళ‌న‌తో పార్ల‌మెంట్ బ‌య‌టికి ప‌రుగులు తీసారు. మొత్తానికి ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఆరుగురు వ్య‌క్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ అమ్మాయి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇలా ఎందుకు చేసారు అని పోలీసులు విచార‌ణ‌లో అడ‌గ్గా.. పాపులర్ అవ్వ‌డం కోస‌మే చేసామ‌ని చెప్తున్నారు. తాము ఎదుర్కొంటున్న వివిధ స‌మ‌స్య‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురావాలంటే ఇలా చేయ‌క త‌ప్ప‌లేద‌ని చెప్తున్నారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, రైతుల క‌ష్టాలు, మ‌ణిపూర్ హింస.. ఇలా అనేక స‌మ‌స్య‌లు త‌మ‌ను ఎంతో డిస్ట‌ర్బ్ చేసాయ‌ని వీటిపై పార్ల‌మెంట్‌లో చర్చించి వెంట‌నే చ‌ర్య‌లు చేప‌డ‌తార‌ని ఇలా చేసామ‌ని అంటున్నారు. అయితే వారంత‌ట వారే ఇలా చేయాల‌ని అనుకున్నారా లేక ఎవ‌రైనా వెన‌కుండి చేయించారా అనే అంశంపై విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు.