TDP, జనసేనతో కలిసే పోటీ చేస్తాం – సీపీఐ నారాయణ

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనతో కలిసి సీపీఐ ఎన్నికల బరిలో నిలవబోతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలవడం అంటూ జరిగితే మా ఓట్లు ఇవ్వడం మాత్రమే కాదని… తమకూ సీట్లు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.. ఇక సీఎం జగన్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సూరుడు, వీరుడు అని అందరూ భావించిన సీఎం జగన్‌… కేంద్రం దగ్గర మొకరిల్లుతున్నాడని విమర్శించారు. పోలవరం విషయంలో వాళ్ల నాన్న వైఎస్ హయాంలో ఉన్న పోరాట స్ఫూర్తి జగన్ లో కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం సీఎం వైఎస్‌ జగన్ కు లేదని నారాయణ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని… పోలవరం ఎత్తు పెంచడంతోపాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం విషయంలో విభజన హామీల హక్కులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిపోయిందన్నారు. మీకు, పోరాడటానికి భయంగా ఉంటే అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకువెళ్ళండి అని సూచించారు. విభజన హామీలు మేం సాధించుకు వస్తాం అంటూ నారాయణ ప్రకటించారు.