Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన కింగ్​!

Hyderabad: భారత క్రికెట్​ మాజీ కెప్టెన్​, ప్రముఖ క్రికెటర్ విరాట్​ కోహ్లీ(Virat Kohli)కి మనదేశంలోనే​ కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. విరాట్​ క్రీజ్​లో ఉన్నాడంటే టీవీకి అతుక్కుపోయే అభిమానులు కూడా ఉన్నారు. ఈసారి ఐపీఎల్‌(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేక పోయినప్పటికీ విరాట్ అద్భుతంగా ఆడాడు. క్రికెట్‌లోనే కాదు సోషల్ మీడియా(Social Media)లోనూ అదరగొడుతున్నాడు విరాట్​. ప్రముఖ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ అయిన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు.

విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఆసక్తికర పోస్టులను షేర్ చేస్తుంటాడు. అందువల్ల ఇన్​స్టాలో విరాట్​ని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 250 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్నాడు. తద్వారా భారత దేశం నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో 250 మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగిన మొదటి వ్యక్తిగా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. తద్వారా క్రీడాకారుల విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో కోహ్లీ నిలిచాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్లు కలిగిన 20 మంది వ్యక్తుల్లో కోహ్లీ ఒకరు. కోహ్లీ 15వ స్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల జాబితాలో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. అతను 585 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. మరో ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 464 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన ఆటగాడు కోహ్లీ కావటం విశేషం.