Viral Video: చెల్లి కాలిపోతుంటే.. వీడియో తీసిన అన్న!

Uttar Pradesh: సోషల్​ మీడియా(Social media), పెరుగుతున్న సాంకేతికత, ఆధునిక నాగరికత, నిర్లక్ష్యం, బంధాలు బంధుత్వాలంటే విలువ లేకపోవడం, సగటు మనిషిని మనిషిలా చూడలేకపోవడం.. ఇలా కారణం ఏదైనా మనుషుల్లో రోజురోజుకీ నేరప్రవృత్తి(Crime), పైశాచికత్వం పెరిగిపోతోంది. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, భార్యాభర్తలు.. ఏ బంధానికీ విలువ లేదు. తన, మన భేదం లేదు.. ఎవరు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో తెలియట్లేదు. కళ్లెదుట మనిషి చనిపోతున్నా.. కాపాడాల్సిందిపోయి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. తాజాగా అన్నాచెల్లెళ్ల బంధానికే మచ్చ తెచ్చే ఘటన ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)​లో జరిగింది. షాజహాన్ పూర్ లో చెల్లిని సొంత అన్నే ఆత్మహత్యకు ప్రేరేపించాడు. అంతేకాదు ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంటుంటే.. అడ్డుకుని కాపాడాల్సింది పోయి వీడియో తీశాడు. పైశాచిక ఆనందం పొందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral Video) గా మారింది.
సంజీవ్​ యాద్, సరోజ్​ యాదవ్​ అన్నాచెల్లెళ్లు. ​ఇంటి పక్కన వారితో జరిగిన గొడవ కారణంగా వారి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లారు. ఈ ఘటనతో క్రుంగిపోయిన సరోజ్​ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. అయితే, ఆమెను అడ్డుకోవాల్సిన సోదరుడు సంజీవ్ చెల్లిని ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించాడు. దాంతో సరోజ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. అంతే, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి సరోజ్ యాదవ్ విలవిలలాడింది. నొప్పి భరించలేక గట్టిగా కేకలు వేసింది. ఈ ఘటన పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ వీడియో చూసి.. వాడసలు మనిషేనా? సైకోనా? శాడిస్టా? అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.