త‌న పోలిక‌లు రాలేద‌ని.. ప‌సికందు పీక కోసిన తల్లి!

పుట్టిన బిడ్డకు తండ్రి పోలీకలు వచ్చాయని.. తల్లి పోలికలు అసలు రాలేదని.. చుట్టు పక్కల వారు బంధువులు అనడం చూసి ఆ మహిళ తట్టుకోలేకపోయింది. దీన్ని అవమానకరంగా భావించిన ఆ కసాయి తల్లి మూడు నెలలు నిండిన తన కుమార్తెను గొంతు కోసి దారుణంగా చంపేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. ఎంతో ఓర్పుతో ఉండాల్సిన మహిళలు ఇలా చిన్న చిన్న విషయాలకే కన్న బిడ్డలను చంపుకుంటుంటే.. మానవత్వం ఎటు పోతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల మహిళలే నేరాలకు పాల్పడుతుండటం ఆందోళనలు రేపుతున్నాయి. మూడు నెలల కుమార్తెను చంపిన ఆ కసాయి తల్లి.. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన బిడ్డను ఎవరో వచ్చి గొంతు కోసి వెళ్లిపోయారని ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆమె ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా ఎలాంటి ఆధారాలు, అనుమానితులు కనిపించలేదు. దీంతో ఆ మహిళనే పోలీసులు విచారణకు పిలిచి వారి స్టైల్లో విచారించడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. తనకు పుట్టిన మూడు నెలల పాపకు అత్త మామలు, బంధువులు, చుట్టుపక్కల వారందరూ ఆ పాపకు తండ్రి పోలికలు ఎక్కువగా వచ్చాయని నిత్యం చర్చించుకునే వారట.. తల్లి పోలీకలు అస్సలు రాలేదని వారు చెప్పడం సదరు మహిళకు నచ్చలేదు. వారి మాటలతో మనస్తాపానికి గురైన ఆమె.. మూడు నెలల పసికందుని కర్కశంగా చంపేసింది. ఈ ఘటనసై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు.