కదలని బస్సు.. కాస్త‌లో పరీక్ష మిస్సు.. కానీ!

ఓ వైపు భారీ వర్షం కురుస్తోంది.. ఇంటర్‌ పరీక్ష విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు సడన్‌గా ఆగింది. మరోవైపు పరీక్షకు సమయం సమీపిస్తోంది. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించేది లేదన్న అధికారుల హెచ్చరికతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. చివరకు ఆటోలో సకాలంలోనే కేంద్రానికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఇబ్బందికర పరిస్థితి వైరా మండలం ముసలిమడుగులోని తెలంగాణ గిరిజన బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థినులకు ఎదురైంది. వీరికి కళాశాల నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని ఉన్న ఓ పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. దీని కోసం వీరికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు. కొంచెం దూరం వెళ్లగానే వర్షం కారణంగా బస్సు టైరు బురదలో దిగబడింది. దీంతో విద్యార్థినులు కిందకు దిగి నెట్టినా బస్సు కదలకపోవడంతో కళాశాల ప్రిన్సిపల్‌ నాగేంద్రమ్మ, ఎంఈఓ వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన వారు.. నాలుగు ఆటోలను విద్యార్థినుల కోసం పంపారు. దీంతో ఆటోల్లో కేంద్రానికి చేరుకుని ఊపిరిపీల్చుకున్నారు. కాగా, తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన వేల్పుల రాకేష్‌ అనే విద్యార్థి వర్షం కారణంగా బస్సులు లేక ఆటోలో పరీక్షా కేంద్రానికి వచ్చేసరికి నలభై నిమిషాలు ఆలస్యమైంది. దీంతో గురుకుల బాలికల కళాశాల అధికారులు అనుమతించకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు.