కుటుంబ కలహాలతో ఎస్సై, భార్య సూసైడ్‌

కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. అందులోనూ ఎస్సై స్థాయి ఉద్యోగి, అతని భార్య ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. వీరి ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణం కావొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు ఇలా.. తెలంగాణ రాష్ట్రం జనగామ పట్టణంలోని వెంకన్నకుంటలో ఉంటున్న ఎస్సై శ్రీనివాస్‌ భార్య స్వరూప ఇంట్లోని బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోకి వెళ్లి భార్య కనిపించకపోవడంతో అంతా వెతికిన భర్త శ్రీనివాస్‌.. బాత్‌రూంలో విగతజీవిగా కనిపించిన భార్యను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ బాధను తట్టుకోలేక.. తన ఇంట్లో ఉన్న సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై శ్రీనివాస్ సూసైడ్‌ చేసుకున్నారు. ఈయన ప్రస్తుతం జనగామ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్నారు. ఈ రెండు ఘటనలు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వెలుగులోకి వచ్చాయి. ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యకు ముందు ఇంట్లో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో.. ఏప్రిల్ 6వ తేదీ గురువారం తెల్లవారుజామున అతని భార్య స్వరూప బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్సై శ్రీనివాస్.. తీవ్ర మనోవేదనకు గురై అతను తనువు చాలించాడు. ఈ రెండు సంఘటనలు గంటల వ్యవధిలోనే చోటుచేసుకోవడం అందరినీ నిర్ఘాంతపోయేలా చేశాయి.