summer heat: నిర్మ‌ల్ ప్ర‌జ‌లు జ‌ర భ‌ద్రం!

Hyderabad: తెలంగాణ రాష్ట్రం(telangana state)లో ఎండల తీవ్రత(summer heat) రోజురోజుకీ అధికమవుతోంది. ఇవాళ ఉదయం నుంచే ఎండ క్రమ క్రమంగా పెరిగిపోయింది. దీంతో అనేక జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నానికి కాక పుట్టించే స్థాయిలో సూర్య కిరణాలు ప్రతాపం చూపాయి. 15 జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. గరిష్ఠంగా నిర్మల్‌ జిల్లా(nirmal district)లో 43.8 డిగ్రీలు నమోదైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో 42.7, నల్గొండ జిల్లా కట్టంగూర్‌, ఆదిలాబాద్‌ అర్బన్‌లలో 42.6, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 42.5, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లలో 42.4, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లలో 42.2, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి, నిజామాబాద్‌ జిల్లా మక్లూర్‌ మండలం లక్మాపూర్‌, వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం కేతేపల్లిలలో 42.1, రాజన్నసిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మార్తాన్‌పేట, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లలో 41.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో గరిష్ఠంగా సైదాబాద్‌ మండలం అస్లాంగఢ్‌లో 37.7 డిగ్రీలు, అమీర్‌పేటలో 39 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలపై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ (tsdps) అప్రమత్తత ప్రకటించింది.

నేడు.. రేపు ఉష్ణోగ్రతలు అధికం..
రాష్ట్రంలో బుధవారం, గురువారాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ సూచించింది. రాష్ట్రంలోకి దేశంలోని ఆగ్నేయ దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. అయితే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండల దృష్ట్యా ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అటు వైద్యులు సూచిస్తున్నారు.