విమానంలో తోటి ప్ర‌యాణికుడిపై మూత్ర‌విస‌ర్జ‌న‌

ఈ మధ్యకాలంలో విమాన ప్రయాణాల్లో వరుసగా అనుచిత ఘటనలు జరుగుతున్నాయి. చాలామంది తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసినట్టు తెలుస్తోంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన AA292 విమానం శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి బయలుదేరి.. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం ఉదయం 10.12 గంటలకు చేరుకుంది. ‘అమెరికా యూనివర్సిటీలో చదువుతోన్న ఓ విద్యార్థి ఈ విమానంలో ప్రయాణిస్తూ.. మద్యం మత్తులో నిద్రపోతూ మూత్రవిసర్జన చేశాడు. అది తోటి ప్రయాణికుడిపై పడటంతో క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు’ అని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. అయితే, తాను చేసిన పనికి ఆ విద్యార్థి క్షమాపణ కోరడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అయితే, దీనిని తీవ్రంగా పరిగణించిన ఎయిర్‌లైన్స్.. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చింది.

నిందితుడు మూత్ర విసర్జన చేసిన విషయం గురించి పైలట్‌కు క్యాబిన్ క్రూ సమాచారం ఇవ్వడంతో.. అతడు ఏటీసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అతడ్ని సీఐఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ‘ఘటనపై సీఐఎస్ఎఫ్‌తో కలిసి ఎయిర్‌లైన్స్ సొంత భద్రత బృందం చర్యలు చేపట్టింది.. విమానం చేరుకున్న వెంటనే నిందితుడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. దీనిపై బాధితుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు’ అని పేర్కొన్నాయి.

పౌరవిమానయాన నిబంధనల ప్రకారం.. ఒకవేళ ప్రయాణికుడు అనుచిత ప్రవర్తను రుజువైతే కొన్నాళ్లు నేరం తీవ్రతను బట్టి విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తారు. గత ఏడాది నవంబరు 26న ఎయిరిండియా విమానంలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలోని శంకర్ మిశ్రా అనే ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రం పోసిన విషయం తెలిసిందే. ఆ ఘటన నెల రోజుల తర్వాత వెలుగులోకి రావడంతో డీజీసీఏ తీవ్రంగా పరిగణించింది. ఘటనపై 12 గంటల్లోగా ఫిర్యాదు చేయని ఎయిరిండియాకు.. సకాలంలో స్పందించలేదని పేర్కొంటూ రూ.30 లక్షల జరిమానా విధించింది. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన అతడికి 4 నెలల ప్రయాణ నిషేధం విధించారు. డిసెంబరు 6 కూడా పారిస్- న్యూఢిల్లీ ఎయిరిండియా విమానంలోనూ ఇలాగే జరిగింది. ఇలాంటి వరుస ఘటనలు విమానయానంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.