బాలీవుడ్​ టాక్​ షోలో సౌత్​ సూపర్​ స్టార్స్​!

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ నేషనల్​ లెవల్లోనే టాప్​ టాక్​ షోగా కొనసాగుతోంది. సక్సెస్​ఫుల్​గా 7 సీజన్లను పూర్తిచేసుకున్న ఈ షో 8వ సీజన్​ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ షో తదుపరి సీజన్​ మొదలవుతుందని బాలీవుడ్ ఇన్​సైడ్​ టాక్​. అయితే, ఈసారి కేవలం బాలీవుడ్ స్టార్స్‌ను మాత్రమే కాకుండా, దక్షిణాది నుంచి  పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదిగిన ముగ్గురు టాప్ స్టార్స్‌ను ఈ షోలో గెస్టులుగా కూర్చోబెట్టబోతున్నాడట కరణ్​. అంతేకాదు 8వ సీజన్ తొలి ఎపిసోడ్‌ను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇంతకీ ఈ షోలో పాల్గొనబోతున్న సౌత్​ ​స్టార్స్​ ఎవరో తెలుసా..? తమ సినిమాలతో పాన్​ ఇండియా స్టార్లుగా ఎదిగిన అల్లు అర్జున్, యశ్​, రిషబ్​ షెట్టి. ఇప్పటికే ఆర్​ఆర్​ఆర్​ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా మెగాపవర్​ స్టార్​ రామ్​ చరణ్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​తో పాటు దర్శకధీరుడు రాజమౌళి ఈ టాక్​ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే.​

‘పుష్ప-ది రైజ్’ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన అల్లు అర్జున్, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్​ పుష్ప 2 షూటింగ్​తో బిజీగా ఉన్నాడు బన్నీ.  ఇక దక్షిణాదిన కేజీయఫ్ చిత్రంతో మరో పాన్ ఇండియా హీరోగా ఎదిగారు కన్నడ స్టార్​ యశ్​.  కేజీయఫ్ 2 సినిమాతో తన స్టార్‌డమ్‌ను మరింతగా పెంచేసుకున్న ఈ హీరో ఇటు దక్షిణాదినీ, అటు బాలీవుడ్​ని ఒకే సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇక, కాంతార వంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కాంతార చిత్రం భాషతో సంబంధం లేకుండా సెన్సేషన్​ క్రియేట్​ చేసింది. ఇప్పుడు ఈ ముగ్గురు సౌత్​ ఇండియా స్టార్స్​ కాఫీ విత్​ కరణ్​ షోలో కబుర్లు చెబితే అటు షోతో పాటు ఈ పాన్​ ఇండియా స్టార్స్​ క్రేజ్​ అమాంతం పెరిగిపోవడం ఖాయమంటున్నారు అభిమానులు.