భార్యతో కలిసి కన్నతల్లిని కడతేర్చిన కుమారుడు?

కట్టుకున్న భార్యతో కలిసి కన్న తల్లిని కొడుకే కడతేర్చాడని ఆగ్రహించిన గ్రామస్తులు ఇద్దరినీ చితకబాదారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం, అమడబాకుల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ‌స్థులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శంకరమ్మ (60)‌ కుమారుడు జేసీబీ రాములు, కోడలు శివమ్మ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే.. కోడలికి, శంకరమ్మకు త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. ఇటీవల కోడలు కొట్టడం వల్ల ఆమె కాలు విరిగి నడవలేని స్థితిలో శంకరమ్మ వెళ్లారు. దీంతో ఆమె అప్పటి నుంచి మాంచానికే పరిమితమయ్యారు. ఈ నేప‌థ్యంలో శంక‌ర‌మ్మ‌ మంగళవారం ఉదయం సంపులో పడి శవమై కనిపించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కొడుకు, కోడ‌లు కుట్ర‌ప‌న్ని శంకరమ్మను చంపారని వారి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. నడవలేని స్థితిలో ఉన్న శంకరమ్మ సంపులో ఏ విధంగా పడుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తలకు దేహశుద్ది చేసిన గ్రామస్తులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన కొత్తకోట ఎస్సై రాజశేఖర్ రెడ్డి వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి కుమారుడు, కోడ‌లిని కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.