నాకు చావాల‌ని లేదు.. కాపాడు: స‌తీష్ చివ‌రి మాట‌లు

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌తీష్ కౌషిక్ ఇటీవ‌ల క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. మార్చి 9న తెల్ల‌వారుజామున ఆయ‌న గుండెపోటుతో చ‌నిపోయారు. అయితే ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కి తీసుకెళ్తున్న స‌మ‌యంలో స‌తీష్‌.. త‌న మేనేజ‌ర్‌తో చెప్పిన మాట‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. నాకు చావాల‌ని లేదు కాపాడు అంటూ ప‌దే ప‌దే త‌న‌తో చెప్పార‌ని స‌తీష్ మేనేజ‌ర్ సంతోష్ రాయ్ మీడియా వ‌ర్గాల‌కు తెలిపారు. 8న హోళీ వేడుక‌ల్లో పాల్గొని త‌న స్నేహితులు, స‌న్నిహితుల‌తో సంతోషంగా సెల‌బ్రేట్ చేసుకున్న స‌తీష్‌.. ఆ మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున ఒంట్లో న‌ల‌త‌గా ఉంద‌ని త‌న మేనేజ‌ర్ సంతోష్‌కు చెప్పారు. దాంతో సంతోష్ వెంట‌నే డ్రైవ‌ర్‌ను పిలిపించి కారులో హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. కారులో వెళ్తున్న స‌మ‌యంలో స‌తీష్ త‌న భుజంపై వాలి.. సంతోష్ నాకు చావాల‌ని లేదు. నన్ను కాపాడు. నా కూతురు వ‌న్షిక కోసం నేను బ‌త‌కాలి. నేను బ‌త‌క‌నేమో అనిపిస్తోంది. శ‌శిని, వ‌న్షిక‌ను నువ్వే చూసుకోవాలి అని చెప్పార‌ని సంతోష్ తెలిపారు. సతీష్‌కి ఊబ‌కాయంతో పాటు ఆస్త‌మా, డ‌యాబెటిస్, బీపీ కూడా ఉన్నాయ‌ని తెలిపారు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు స‌తీష్‌.. హాస్పిట‌ల్‌కు వెళ్తుండ‌గానే మార్గ‌మ‌ధ్య‌లో క‌న్నుమూసారు.

అయితే సతీష్ మృతిపై అనుమానాలు ఉన్నాయ‌ని ముంబై పోలీసులు తెలిపారు. ఆయ‌న హోళీ ఆడిన స‌మ‌యంలో ఇంట్లో ఏవో ఔషధాలు దొరికాయ‌ని అన్నారు. మృత‌దేహానికి పోస్ట్‌మార్టం చేసాక‌.. ఆయ‌న గుండెపోటుతోనే చ‌నిపోయార‌ని వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాకముందు వ‌ర‌కు పోలీసులు.. స‌తీష్‌తో క‌లిసి ఎవ‌రైతే హోళీ వేడుక‌ల్లో పాల్గొన్నారో వారంద‌రినీ పిలిపించి విచారించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం అయ్యాక సతీష్ మృత‌దేహాన్ని ముంబైలోని త‌న నివాసానికి తీసుకొచ్చి సాయంత్రానికే అంత్యక్రియ‌లు నిర్వ‌హించారు.

“మా ఆయ‌నే స‌తీష్‌ను చంపేసారు”

అయితే స‌తీష్‌ను త‌న భ‌ర్తే విషం ఇచ్చి చంపేసార‌ని షాకింగ్ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు కుబ‌ర్ గ్రూప్ సంస్థ‌ల డైరెక్ట‌ర్ వికాస్ మ‌లు స‌తీమ‌ణి సాన్వి మ‌లు. ఈ మేర‌కు ఆమె దిల్లీ పోలీస్ క‌మీష‌న‌ర్‌కు లెట‌ర్ కూడా రాసారు. త‌న భ‌ర్తే స‌తీష్‌ను చంపేసార‌ని లెటర్‌లో పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం స‌తీష్‌.. త‌న భ‌ర్త వికాస్‌కు 15 కోట్లు అప్పుగా ఇచ్చార‌ని ఆ అప్పును తీర్చ‌లేక స‌తీష్‌ను తెలివిగా చంపేసార‌ని ఆరోపిస్తున్నారు. స‌తీష్‌.. నా భ‌ర్త‌కు చెందిన ఫాం హౌస్‌లో హోళీ ఆడిన త‌ర్వాతే అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కొన్ని రోజుల క్రితం త‌న డ‌బ్బు వెన‌క్కి ఇవ్వాల‌ని స‌తీష్.. వికాస్‌ను అడిగారు. ఈనేప‌థ్యంలో వారి మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రిగింది. ఆ డబ్బు ఇవ్వ‌కుండా త‌ప్పించుకోవ‌డానికే వికాస్.. స‌తీష్‌పై విష ప్ర‌యోగం చేసాడేమో అనిపిస్తోంది. అంతేకాదు వికాస్ నాపై గ‌తేడాది అత్యాచారం కూడా చేసాడు అని ఆరోపించారు. అయితే స‌తీష్ కుటుంబీకులు మాత్రం దీనిపై స్పందించ‌లేదు.