సామ్​ ఈజ్​ బ్యాక్​.. ‘ఖుషీ’లో ఫ్యాన్స్​!

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత కొంతకాలంగా మయోసైటిస్​తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందువల్ల సామ్​ భాగమైన సినిమాల షూటింగ్​లు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న‘ఖుషీ’ సినిమా వాయిదా పడింది. శివ నిర్వాణ దర్శకత్వంలో 2022 ఏప్రిల్ లోనే మొదలైన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా విడుదల తేదీ కూడా పెండింగ్ లో పడింది. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో కూడా మేకర్స్ అప్​డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే తాజాగా దర్శకుడు శివ నిర్వాణ అదిరిపోయే అప్​డేట్ ఇచ్చాడు. మార్చి 8న ఖుషీ సెట్స్​లోకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫోటోలని ట్విటర్లో షేర్ చేశాడు.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషీ’. సమంత షూటింగ్​కి హాజరైన సందర్భంగా కేక్ కట్​ చేసి సామ్​కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సమంత ఆరోగ్యం బాగుపడిందని అభిమానులు సంబరపడుతున్నారు. ఖుషీ షూటింగ్ ప్రారంభమైతే త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారని ఆశ పడుతున్నారు. రొమాంటిక్ కామెడీ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మలయాళ  మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక లైగర్ ప్లాప్ తో డీలా పడిన రౌడీ అభిమానులు ఒక హిట్టు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ని హ్యాండిల్ చేయడంలో దర్శకుడి శివ నిర్వాణకి మంచి అనుభవం ఉంది. దీంతో ఖుషీ వంటి క్లాసికల్ హిట్ మూవీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. త్వరలోనే ఖుషీ రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. పీటర్ హేన్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. శివ నిర్వాణ ట్వీట్ చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మెయిన్ రోల్లో తెరకెక్కిన శాకుంతలం సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేసినట్టు, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చిత్రం బృందం పేర్కొంది. ప్రస్తుతం సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుండడంతో, ఖుషీ రెగ్యులర్ షూటింగ్లో భాగం కానుంది. కాగా, శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్​ స్టార్​ నాని హీరోగా భారీ అంచనాల నడుమ విడుదలైన టక్ జగదీష్ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఈ సినిమా సక్సెస్ శివ కెరీర్​కి కీలకం కానుంది. అటు పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో పాన్​ఇండియా సినిమాగా భారీ బడ్జెట్​తో తెరకెక్కిన లైగర్ సినిమా ఊహించని విధంగా దెబ్బ కొట్టడంతో కెరీర్​ పరంగా ఢీలాపడిన రౌడీ హీరో విజయ్ దేవరకొండకీ ఈ సినిమా విజయం అత్యంత కీలకమని చెప్పవచ్చు.