‘RRR సినిమాని ఎన్టీఆర్‌‌-బాలయ్యతో చేద్దామనుకున్నాం’

పీరియాడికల్​ యాక్షన్​ డ్రామాగా తెరకెక్కి ఆస్కార్​ను కైవసం చేసుకున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. విడుదలై ఏడాది కావస్తున్నా ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్​ ఒరిజినల్​ స్కోర్​ కేటగిరీలో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రానికి పని చేసిన అందరూ తమ సంతోషాన్ని, సినిమా షూటింగ్​ సమయంలో తమ అనుభవాలనూ పంచుకుంటున్నారు. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఎన్టీఆర్​, రామ్​ చరణ్​, కార్తికేయ, రాహుల్​ సిప్లిగంజ్​ ఈ సినిమా సాధించిన విజయం పట్ల సోషల్​ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకోగా, తాజాగా ఈ సినిమాకు కథను అందించిన రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్​ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ​

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్​ఆర్​ఆర్​ సినిమా గురించి పలు విషయాలను పంచుకున్న విజయేంద్ర ప్రసాద్ అసలు ఈ సినిమా కథ రాస్తున్నప్పుడు హీరోలుగా ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ని తీసుకోవాలని అనుకోలేదనీ,  చిరంజీవి–  రామ్​ చరణ్​తోగానీ, బాలయ్య– ఎన్టీఆర్​తోగానీ తీద్దామనుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘RRR కథని ముందుగా అనుకున్నప్పుడు రామ్ చరణ్ – ఎన్టీఆర్ పేర్లు మాకు తట్టలేదు. రామ్ చరణ్– చిరంజీవి కాంబినేషన్ లో చేద్దామా, లేదా ఎన్టీఆర్ –  బాలయ్య కాంబినేషన్ లో చేద్దామా, సూర్య – కార్తీ కాంబినేషన్ లో చేద్దామా , ఇలా ఎన్నో కాంబినేషన్స్ ని అనుకున్నాం. కానీ రాజమౌళి.. ‘వేరే హీరోలతో అయితే ఈగో క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు రామ్ చరణ్ – ఎన్టీఆర్ బాగా క్లోజ్, వాళ్ళతో అయితే నేను బాగా కంఫర్ట్ ఫీల్ అవుతాను’ అని చెప్పడంతో ఈ కాంబినేషన్​ సెట్​ అయ్యింది. అలా ఈ సినిమా పుట్టింది’ అంటూ చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. రామ్ చరణ్– ఎన్టీఆర్ నిజజీవితంలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ చాలా తేలికగా సెట్ అయిపోయిందన్నారు.

ఇక, అమెరికాలో జరిగిన ఆస్కార్​ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఇండియా తిరిగొచ్చిన రామ్​ చరణ్​, ఎన్టీఆర్​ తమ తమ పనులతో బిజీ అయ్యారు. తాజాగా శంకర్​ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్​సి15 షూటింగ్​కు హాజరైన రామ్​ చరణ్​కు ఘన స్వాగతం లభించింది. ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్న ఇండియన్​ మైఖేల్​ జాక్సన్​ ప్రభుదేవా నాటు నాటు పాటకి తనదైన స్టైల్​లో స్టెప్స్​ వేసి, కేక్​ కట్​ చేసి ఆర్​ఆర్​ఆర్​ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఎన్టీఆర్​ కూడా ఆస్కార్​ అనంతరం హీరో విశ్వక్​ సేన్​ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్​ కార్యక్రమంలో పాల్గొని అభిమానులను పలకరించారు. అంతేకాదు త్వరలోనే తన తదుపరి సినిమా మొదలవనుందని హింట్​ ఇచ్చారు. అన్నట్టుగానే ఈ నెల 23న ఎన్టీఆర్​ 30 పూజా కార్యక్రమాలు జరగనున్నాయని అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్​.