Pushpa 2: అదిరిపోయే అప్​డేట్​తో బన్నీ బర్త్​డే ట్రీట్​!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా పుష్ప2. గతేడాది విడుదలై బాక్సాఫీస్​ వద్ద సూపర్​ హిట్​గా నిలిచిన పుష్ప: ది రైజ్ సినిమాకి సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పుష్పతో అల్లుఅర్జున్​ పాన్​ ఇండియా స్టార్​గా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.​ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని బన్నీ ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అందరూ అనుకున్నట్టుగానే పుష్ప2కు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. పుష్ప2 కాన్సెప్ట్ టీజర్‌‌ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాన్సెప్ట్‌ టీజర్‌‌ను ఏప్పిల్‌7న సాయంత్రం 4:05 నిమిషాలకు వీడియో విడుదల చేయనున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. ఏప్రిల్‌ 8వ తేదీన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

6వ తేదీ ఉదయం 11:07 గంటలకు పుష్ప2 కు సంబంధించి అధికారిక సమాచారం ఇవ్వనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ కనిపించనుండగా, ఆయన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందని టాక్. ఈ పాన్ ఇండియా సినిమాలో ముఖ్య పాత్ర కోసం జగపతిబాబు కూడా నటిస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్లు పుష్ప2 రైట్స్ గురించి ఆరా తీసి రికార్డు ధరలు ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ మైత్రీ మూవీ మేకర్స్ ఎవరికీ ఎలాంటి రైట్స్ ఇవ్వడం లేదని, ఈ సినిమాను అన్ని భాషల్లో సొంతంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌తో పాన్‌ ఇండిమా స్టార్‌‌గా ఎదిగారు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న పుష్ప2 సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో కూడా మొదటి భాగంలో శ్రీవల్లిగా అలరించిన రష్మికా మందాన హీరోయిన్‌గా నటిస్తున్నారు. పుష్ప సినిమాలోని పాటలు ఇప్పటికీ యూట్యూబ్‌లో చాట్ బస్టర్స్‌ గా నిలుస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ చేసిన పుష్ప భారీ హిట్ అందుకోవడంతో పుష్ప2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పుష్ప సినిమాను మించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా పుష్ప2ను తెరకెక్కిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా గురించి బన్నీ అభిమానులతోపాటు ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ అర్జున్​ రెడ్డి డైరెక్టర్​ సందీప్​ రెడ్డి వంగాతో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక, ఏప్రిల్‌ 8వ తేదీన బన్నీ పుట్టినరోజు సందర్భంగా దేశముదురు సినిమాను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.