వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య నడవనున్న ఈ సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం ప్రధాని నరేంద్రమోదీ 10వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. ఈ రైలులో కొంతమంది విద్యార్థులు నల్గొండ వరకు ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని.. నేరుగా వందేభారత్‌ రైలు ఎక్కారు. అక్కడ ఉన్న విద్యార్థులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం జెండా ఊపి రైలును ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం చేర్యాల పెయింటింగ్‌ను రైల్వే శాఖ మంత్రి ప్రధానికి అందించారు.

ప్రత్యేక విమానంలో బేగంపేటకు మోదీ..
ఢిల్లీ నుంచి.. ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ ఇవాళ ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే… ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్‌ రాలేదు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమర్‌ మోదీకి స్వాగతం పలికారు. బేగంపేట నుంచి ఎస్పీజీ దళాల ప్రత్యేక కాన్యాయ్‌ పర్యవేక్షణలో మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు.

సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది. అలాగే, తిరుపతి – సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది.