YCPకి నా హృదయపూర్వక విన్నపం: ప‌వ‌న్

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో విశాఖ వేదికగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సును మార్చి 3, 4 తేదేల్లో నిర్వహించనుండగా.. సుమారు 25 దేశాల నుంచి, మన దేశంలోని వివిధ పరిశ్రమల నుంచీ దాదాపు 19 వేల మందికి పైగా ప్రతినిధుల రానున్నట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలో సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌.. ట్విట‌ర్ వేదిక‌గా స‌ద‌స్సు గురించి త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. అంతేకాదు వైసీపీ ప్ర‌భుత్వానికి ఒక విన్న‌పం కూడా చేసారు.

“దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను.ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక విన్నపం. ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి! ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చండి. ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న అని ట్వీట్ చేసారు.