20వ ఫ్లోర్ నుంచి ప‌డి.. ఓయో వ్య‌వ‌స్థాప‌కుడి తండ్రి మృతి

ఓయో వ్య‌వ‌స్థాప‌కుడు రితేష్ అగ‌ర్వాల్ తండ్రి ర‌మేష్ అగ‌ర్వాల్ దుర్మ‌ర‌ణం చెందారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం హ‌ర్యాణాలోని గురుగ్రామ్‌లో ఈ ఘట‌న జ‌రిగింది. ర‌మేష్ అగ‌ర్వాల్ త‌న కుటుంబంతో క‌లిసి గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ది క్రెస్ట్ సొసైటీలో నివ‌సిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు మ‌ధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌లోని 20వ అంత‌స్తు నుంచి ఎవ‌రో వ్య‌క్తి ప‌డిపోయిన‌ట్లు సెక్యూరిటీకి స‌మాచారం అందింది. వెంట‌నే వెళ్లి చూడ‌గా.. ఆయ‌న రితేష్ అగ‌ర్వాల్ తండ్రి ర‌మేష్ అగర్వాల్‌గా గుర్తించారు. సెక్యూరిటీ వెంట‌నే ఆయ‌న్ను ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే ర‌మేష్ చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. అయితే ర‌మేష్ జారి ప‌డిపోయే అవ‌కాశం లేద‌ని, ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటార‌న్న కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నార‌ట‌. ఎందుకంటే.. ర‌మేష్ నివ‌సిస్తున్న అపార్ట్‌మెంట్ రైలింగ్ 3.5 అడుగుల ఎత్తు ఉంటుంద‌ట‌. ఓ వ్య‌క్తి అక్క‌డి నుంచి జారి ప‌డిపోయే అవ‌కాశం లేద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవ‌ల రితేష్ అగ‌ర్వాల్ వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో ర‌మేష్‌తో పాటు ఎంద‌రో పారిశ్రామిక‌వేత్త‌లు పాల్గొన్నారు. ఇంత‌లో ర‌మేష్ ఇలా చ‌నిపోవ‌డం బాధాక‌రం. ర‌మేష్ మృత‌దేహాన్ని పోస్ట్ మార్టెంకు త‌రలించిన‌ట్లు తెలుస్తోంది.