‘మాది భార్యాభర్తల బంధం’

సినీ పరిశ్రమలో స్టార్​ హీరోల మధ్య సినిమాలపరంగా పోటీ ఉన్నా వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉంటుందని చెప్పవచ్చు. అయితే టాలీవుడ్​లో మెగాస్టార్ చిరంజీవితో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఉన్న విభేదాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాగ్రౌండ్​ లేకుండా వచ్చి తమకంటూ ప్రత్యేక హోదాను, స్థాయిని సంపాదించుకున్న ఈ ఇద్దరు స్టార్ల మధ్య తరచుగా విభేదాలు తలెత్తడం చూస్తూనే ఉంటాం. వీరిద్దరి మధ్య దాదాపు 15 ఏళ్ల క్రితమే కీచులాట మొదలైంది. 15 ఏళ్ల కిందట జరిగిన తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవికి ‘లెజెండ్’ అవార్డు ప్రకటించడంపై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం కలిగించాయి. ‘లెజెండ్’ అవార్డు తీసుకునే అర్హత తనకు లేదా అంటూ చిరంజీవి పేరు ప్రస్తావించకుండానే ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో అలజడి సృష్టించాయి.. ఈ వ్యాఖ్యలపై వజ్రోత్సవంలో చిరంజీవి కూడా ఘాటుగా స్పందించారు. తాను ఎదిగిన విదానాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అప్పటి నుంచీ మోహన్ బాబు, చిరంజీవి మధ్య ఏదో ఒకరకంగా విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే వీటిపై తాజాగా మోహన్​ బాబు ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

ఓ యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్​ బాబు మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి. వాటిలో నిజాలేంటి, అసత్యాలేంటి ఎవరికీ తెలీదు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు. ఇప్పుడు మేం హ్యాపీగా ఉన్నాం. కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, ఆత్మీయుల మధ్య చిన్న మాటలు దొర్లుతుంటాయి. భారత, రామాయణ, భాగవతంలో చూశాం. కాబట్టి అది నథింగ్. ఆ విషయాలు వద్దు. వేరే మాట్లాడుకుందాం’ అని దాటవేశారు.

ఇక, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు వర్గం, చిరంజీవి వర్గం మధ్య పోటీ గట్టిగా నడిచింది. మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ వివాదంపై మోహన్ బాబు స్పందించారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఒక చరిత్ర. అలా ఎందుకు జరిగిందని నేను ఆశ్చర్యపోతుంటాను. విజయాన్ని సాధించాడు బిడ్డ. విష్ణువర్ధన్ బాబు ఏదైతే చెప్పాడో అన్నీ చేశాడు. బిల్డింగ్ ఒక్కటే మిగిలి ఉంది తప్ప.. మిగిలింది అద్భుతంగా చేశారు. కాదని పగవాడు కూడా చెప్పలేడు. ఊరికే జోక్‌గా కామెంట్లు అవీఇవీ తప్ప.. అవెవడు చూస్తాడు పిచ్చోడు చూస్తాడు. ఆ మనసు కష్టం కూడా నాకు చిరంజీవికి రాకూడదు అనిపించింది. ఆ బాధ ఇంకా నాలో ఉంది. ఎందుకు జరిగిందది.. అది అతని తప్పా, నా తప్పా అనే విషయం నేను చర్చించదలుకోలేదు’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

‘ఆ ఘటన తర్వాత వందసార్లు ఎదురుపడ్డాం, వందసార్లు మాట్లాడుకున్నాం. మా మధ్య ఏమీ లేదు. జనం అనుకోవడమే. భార్యాభర్తలకు ఉంటుంది కదా.. అలాంటి కీచులాటే మా మధ్య ఉంటుంది. మా మధ్య వాతావరణం ఎప్పుడూ కూల్​గానే ఉంటుంది’ అన్నారు. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్‌లో తాను పాల్గొనడంపై మోహన్ బాబు స్పందించారు. బాలయ్య అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆయన కోసమే ఆ షోలో పాల్గొన్నానని స్పష్టం చేశారు. ‘నేను బాలయ్య అని అంటుంటాను. ఆయన నన్ను సోదరా అని పిలుస్తాడు. ఫోన్ చేసి మీరు రావాలి అన్నాడు. తప్పకుండా వస్తాను అన్నాను. ఐ లవ్ హిమ్. ఐ లవ్ దట్ ఫ్యామిలీ. ఐ లైక్ హిమ్. అడిగాడు.. యస్ వస్తాను అన్నాను. వెళ్లాను.. చాలా హ్యూమర్‌గా, సరదాగా జరిగింది. కేవలం బాలకృష్ణ కోసమే వెళ్లాను. బాలయ్యను అలా చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చారు డైలాగ్​ కింగ్​ మోహన్​ బాబు.