శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనం కోసం టికెట్లను బుక్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నేడు శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఆన్ లైన్ కోటా విడుదల చేయనుంది. జూన్ నెలలో దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. వీటితోపాటు శ్రీవారి సేవకు సంబంధించిన పలు టికెట్లను ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంచుతారో తెలియజేసింది.

మార్చి 23న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు…
తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి. అదేవిధంగా, జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ మార్చి 24న ఉదయం 11 గంట‌ల‌కు మొదలవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

అంగప్రదక్షిణం టోకెన్లు:
జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా..
వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం మూడు గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. శ్రీవారి భక్తులు ఆయా సేవలను గమనించి తమ టికెట్లను బుక్ చేయసుకోవాలని టీటీడీ సిబ్బంది కోరింది.