13 ఏళ్లు త‌ల్లి మృత‌దేహాన్ని ఇంట్లో పెట్టుకుని..

క‌న్న‌త‌ల్లి మ‌రణం త‌ట్టుకోలేక‌పోయిన ఆ వ్యక్తి..ఆమె చ‌నిపోయినా త‌న‌తోనే ఉండాల‌నుకున్నాడు. ఇందుకోసం వెన‌కా ముందు ఆలోచించ‌కుండా సమాధి నుంచి త‌ల్లి మృత‌దేహాన్ని బ‌య‌టికి తీసి ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఈ ఘ‌ట‌న పోలాండ్‌లో చోటుచేసుకుంది. మ‌రియ‌న్ అనే వ్య‌క్తికి 61 ఏళ్లు ఉన్న‌ప్పుడు త‌న 95 ఏళ్ల త‌ల్లి అనారోగ్యంతో చ‌నిపోయింది. వారి సంప్ర‌దాయం ప్ర‌కారం మృతదేహాన్ని శ‌వ‌పేటిక‌లో పెట్టి స‌మాధి చేసారు. అయితే త‌ల్లి లేకుండా ఉండ‌లేక‌పోయిన మ‌రియ‌న్.. ఆ మ‌రుస‌టి రోజే స‌మాధి తవ్వి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీసాడు. త‌న ఇంటికి తీసుకెళ్లి మృత‌దేహం కుళ్లిపోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు ర‌సాయ‌నాలు వాడి ఎంబామింగ్ చేస్తుండేవాడు. అలా ఒక‌టి కాదు రెండు కాదు దాదాపు 13 సంవ‌త్స‌రాల పాటు త‌న త‌ల్లి మృత‌దేహాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. ఓసారి మ‌రియ‌న్ బంధువు ఒక‌రు ఆయ‌న ఇంటికి వెళ్లారు. అక్క‌డ కొద్దిగా కుళ్లిపోయి వాస‌న వ‌స్తున్న మృత‌దేహాన్ని చూసి ఉలిక్కిప‌డ్డాడు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. మ‌రియ‌న్ త‌ల్లిని పాతిపెట్టిన ప్ర‌దేశానికి వెళ్లి త‌వ్వి చూడ‌గా అందులో ఎటువంటి ఎముక‌లు, ఆన‌వాళ్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌రియ‌న్ ఇంట్లో పెట్టుకున్నాడ‌ని పోలీసులు ధృవీక‌రించారు. దాంతో మ‌రియ‌న్‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించి క‌స్టడీలోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత మృత‌దేహాన్ని మ‌ళ్లీ పాతిపెట్టేసారు.