NTR30: ముహుర్తం ఫిక్స్​.. చీఫ్​ గెస్ట్​గా మెగాస్టార్​!

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా NTR30.RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించబోయే సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే! RRRతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్​ కోసం దర్శకుడు కొరటాల శివ కథలో మార్పులు చేయడంతో ప్రాజెక్ట్ కొంత ఆలస్యమైంది. ఇక ఆ తర్వాత RRR మూవీ ఆస్కార్ ప్రమోషన్స్, ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మరణంతో NTR30 లాంచింగ్ డేట్ పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. ఆస్కార్​తో ఇండియా తిరిగొచ్చిన ఎన్టీఆర్.. శుక్రవారం రాత్రి విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యరు. ఈ మేరకు తన నెక్ట్స్ మూవీ త్వరలోనే స్టార్ట్ చేస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు. అన్నట్లుగానే NTR30 మేకర్స్.. అఫిషియల్‌గా ముహూర్తం తేదీని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ ప్రకారం.. NTR30 మార్చి 23న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. కల్లోల సంద్రం నుంచి రక్తపు మరకలతో కూడిన ఓ కత్తి పైకి లేచినట్లుగా పోస్టర్ డిజైన్ చేశారు. ఆ కత్తి వాలులో ఎర్రటి సూర్యూడు కనిపిస్తుండగా.. దానిపై NTR30 టైటిల్‌‌ ఎఫెక్టివ్‌గా కనిపిస్తోంది. కాగా.. ఈ పోస్టర్ చూసిన తారక్ ఫ్యాన్స్ క్రేజీగా ఫీలవుతున్నారు. సినిమా ముహూర్తానికి ముందే పోస్టర్స్ ఈ విధంగా ఉంటే.. షూటింగ్ జరిగే కొద్దీ వచ్చే అప్‌డేట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోంది. జాన్వీకి టాలీవుడ్​ ఎంట్రీకి ఈ సినిమా సరైనదని భావిస్తున్నారు అభిమానులు ఇక యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ముహుర్త పూజా కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధులుగా రానున్నారట. సైఫ్ .. ఎన్టీఆర్ 30 లో విలన్ గా నటిస్తున్నాడని టాక్. పాన్ ఇండియా సినిమా కావడం, సైఫ్ ఆల్రెడీ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటించడంతో మంచి గుర్తింపు రావడానికి సైఫ్ ను విలన్ గా తీసుకున్నారని టాక్. ఇక చిరును ప్రత్యేకంగా కొరటాల ఆహ్వానించాడట. ఆచార్య సినిమా పరాజయం పాలయ్యినప్పుడు వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయని వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజం కాదు అని చెప్పడానికి చిరును కొరటాల పిలిచినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.