“నాటు నాటు పాట పెడితేనే నా కొడుకు అన్నం తింటాడు‌‌”

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR.విడుదలైనప్పటి నుంచీ ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విశ్వ వేదికలపై పలు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌నే గెలుచుకుంది. నాటు నాటుకు ఆస్కార్‌ రావడంతో యావత్‌ ప్రపంచం ఈ పాటకు ఫిదా అయ్యింది. నాటు నాటు పాట విడుదలైనప్పటి నుంచే మిలియన్​ వ్యూస్​తో శ్రోతలను ఆకట్టుకుంది. టిక్​టాక్​, ఇన్​స్టాలో కొన్ని మిలియన్ల రీల్స్​తో ఈ సాంగ్ మరింత పాపులర్​ అయ్యింది. సెలబ్రిటీలు కూడా ఈ పాటకు కాలు కదిపారు. ఇంటర్​నేషనల్​ రేంజ్​లో క్రేజ్​ సంపాదించుకున్న ఈ పాటపై తాజాగా బాలీవుడ్​ పాపులర్​ నటి కరీనా కపూర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆమె హోస్ట్‌ చేస్తున్న ‘వాట్‌ ఉమెన్‌ వాంట్‌’ నాలుగ సీజన్‌లో ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతోంది. ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్‌ రిలీజ్‌ అయ్యింది. ఇందులో కరీనా మాట్లాడుతూ.. నాటు నాటు సాంగ్ తో పాటు ఇండియన్ సినిమా మీద ప్రశంసలు కురిపించారు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకోవడం గొప్ప విషయం. ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం. భారతీయ చిత్రాలను అందరూ ఇష్టపడుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను కూడా ఒక సభ్యురాలిని అయినందుకు చాలా సంతోషిస్తున్నాను, అన్నారు. నా చిన్న కొడుకు జహంగీర్ నాటు నాటు సాంగ్ పెడితేనే భోజనం చేస్తున్నాడు. ఈ పాటను నేను తెలుగులో వినడానికి ఇష్టపడతాను… అని చెప్పుకొచ్చారు. తెలుగు సాంగ్ గురించి కరీనా కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా కరీనా-సైఫ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు అనే విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు పేరు తైమూర్‌ కాగా చిన్న కుమారుడు పేరు జెహ్‌.
95వ ఆస్కార్స్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. నాటు నాటు సాంగ్ కంపోజ్ చేసిన కీరవాణి, సాహిత్యం సమకూర్చిన చంద్రబోస్ ఆస్కార్ వేదికపై తమ అవార్డ్స్ అందుకున్నారు. కీరవాణి ఆస్కార్ వేదికపై తన ఆనందాన్ని తెలియజేశారు.