తండ్రిలాంటి వారు అని చెప్పినా ఆ ఎమ్మెల్యే వేధిస్తున్నారు..!

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు.. హ‌నుమ‌కొండ జిల్లా ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లం జాన‌కిపురానికి చెందిన స‌ర్పంచి కురుస‌ప‌ల్లి న‌వ్య త‌న‌ను రాజ‌య్య గ‌త రెండేళ్లుగా లైంగికంగా వేధింపుల‌కు గురిచేసేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, ఇత‌ర మీటింగ్‌ల‌కు వెళ్లిన‌ప్పుడు కౌగిలించుకోవ‌డం, జ‌బ్బ‌ల‌పై చేయి వేయ‌డం, ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తాకుతూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. తన భ‌ర్త ప్ర‌వీణ్‌తో క‌లిసి ఆమె మీడియా ముఖంగా ఈ విష‌యాల‌ను వెల్ల‌డించ‌డంతో.. బీఆర్ఎస్ శ్రేణుల్లో క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రికొన్ని నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎమ్మెల్యేల‌పై రావ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ న‌డుస్తోంది. ఇంకా స‌ర్పంచి న‌వ్య ఎలాంటి ఆరోప‌ణ‌లు చేశారంటే..

బిడ్డ లాంటిదానితో ఐ లవ్యూ అంటాడా..?
ఎమ్మెల్యేను త‌న పిల్లల పుట్టిన రోజు సందర్భంగా క‌లిసిన‌ప్పుడు మాకు మీరు తండ్రిలాంటి వారని, ఇలా చేయడం తగదని చెప్పాన‌ని న‌వ్య తెలిపారు. అయినా ఎమ్మెల్యే ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే త‌న గ్రామానికి మొదటి నుంచీ నిధులు ఇవ్వడంలేదని.. చాలామంది మహిళలు సార్ వద్దకు వచ్చిపోతున్నారని, మీరూ వస్తే మీ గ్రామానికి నిధులు. మీ అవసరాలు తీరుస్తారంటూ… భారాస మహిళ ఒకరు త‌న‌ను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న వ‌ద్ద అన్ని కాల్ రికార్డింగ్స్‌, ప్రూఫ్స్ ఉన్నాయ‌ని స‌ర్పంచి న‌వ్య తెలిపారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆ నాయ‌కురాలి పేరును కూడా అంద‌రికీ చెబుతాన‌ని ఆమె అన్నారు. నీ మీద కోరికతో, ఇష్టంతో పార్టీ టికెట్ ఇచ్చానంటూ ఎమ్మెల్యే వేధించార‌ని ఆమె వాపోయారు. షాపింగ్ పేరుతో తనతో బయటకు వస్తే బంగారం, డబ్బుతో పాటు తన పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానంటూ ప్రలోభపెడుతున్నారని ..తనకే కాదు మండలంలోని మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ సర్పంచి నవ్య బాధ‌ప‌డ్డారు. బిడ్డ లాంటిదానితో ఐ లవ్యూ అంటున్నాడ‌ని.. తాను ఆడపిల్లన‌ని.. ఆట బొమ్మ కాద‌ని.. ఈ విష‌యాన్ని ఎమ్మెల్యే గ‌మ‌నించాల‌ని ఆమె తెలిపారు. మీడియా ముందుకు వ‌చ్చి ఇలా చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంద‌ని.. కానీ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బయటికొస్తే మాట్లాడాల్సి వ‌స్తోంద‌ని.. దీని త‌ర్వాత ఎమ్మెల్యే బాధితులు చాలా మంది బయటకొస్తార‌ని న‌వ్య వివ‌రించారు. రాజయ్య వేధింపుల‌పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్తాన‌న్నారు.

గతంలో ఓ మహిళా నాయకురాలిపై చేయి వేసినట్లు, కేక్ తినిపించినట్లుగా వీడియో, ఫోటోలు వైరల్ కావడంతో కొంటె ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిత్రీకరించబడ్డారు. తాజాగా స‌ర్పంచి నవ్యపై వేధింపుల‌కు పాల్ప‌డుతూ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.

కావాల‌నే కుట్ర చేస్తున్నారు.. – ఎమ్మెల్యే రాజ‌య్య

త‌న‌పై కొంద‌రు కావాల‌నే కుట్ర ప‌న్ని లేనిపోని ఆరోప‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. ఎమ్మెల్యే రాజ‌య్య తెలిపారు. జ‌రిగిన వాస్త‌వాల‌ను త్వ‌ర‌లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాన‌ని ఆయన అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తనని అప్రతిష్టపాలు చేసేందుకే కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని రాజయ్య ఆరోపించారు.