ఇంటర్‌ ప్రశ్నాపత్రాల్లో తప్పులు.. ఆందోళనలో విద్యార్థులు!

తెలంగాణకు సంబంధించిన ఇంటర్‌ పరీక్ష పత్రాల్లో వరుసగా తప్పులు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. నిన్న విద్యార్థులకు గణితం- 1ఏ, పొలిటికల్‌ సైన్స్‌, బోటనీ పరీక్షలు జరిగాయి. గణితం తెలుగు మాధ్యమం ప్రశ్నపత్రంలో 13వ ప్రశ్నలో చతుర్ముఖి బదులు చతుర్ముఖ అని ప్రచురితమైంది. రాజనీతిశాస్త్రం తెలుగు మీడియం పేపర్‌ 17వ ప్రశ్నలో సంబంధం బదులు బేధాలు అని, ఆంగ్ల మాధ్యమంలో రిలేషన్‌షిప్‌ విత్‌ బదులు డిఫరెంట్‌ ఫ్రం అని తప్పుగా ముద్రించారు. అదే ప్రశ్నకు ఉర్దూ మాధ్యమంలో కూడా తప్పు దొర్లింది. ఉర్దూ మీడియం బోటనీలో రెండు ప్రశ్నల్లో దోషాలు వచ్చాయి. వాస్తవానికి ప్రశ్నలు తప్పుగా ఉంటే వాటికి మార్కులు కలపాలి. కానీ ఇంటర్‌బోర్డు మాత్రం పరీక్షలు ప్రారంభమైన తర్వాత తప్పులను గుర్తించి… ఆయా ప్రశ్నల్లో సరైన పదాలు, అంకెలు ఏమిటో వివరిస్తూ వాటిని సరిచేసుకొని చదువుకోవాలని అన్ని పరీక్షా కేంద్రాలకు సమాచారం పంపుతోంది. వాటిని ముందే చెప్పాం కాబట్టి మార్కులు కలపాల్సిన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంతోనే తప్పులు వచ్చినా ఎరాటా పంపొచ్చు అని ప్రశ్నపత్రాల రూపకల్పనలో పాల్గొంటున్న అధ్యాపకులు, బోర్డు అధికారులు అశ్రద్ధగా ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

పరీక్ష మధ్యలో సవరణలు చెప్పడం ఇబ్బంది…
పరీక్ష రాస్తున్న క్రమంలో ప్రశ్నా పత్రాల్లో కొన్ని తప్పులు ఉన్నాయని వాటిని సవరించుకోవాలని అధ్యాపకులు వచ్చి చెప్పడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష గదిలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియం విద్యార్థులుంటారు. ఇతర సబ్జెక్టులను రాసేవారూ ఉంటారు. ఆ సమయంలో తప్పులను రాసుకొచ్చి పరీక్ష గదిలో చదివే క్రమంలో సమయం వృథాతోపాటు ఏకాగ్రత దెబ్బతింటోందని విద్యార్థులు చెబుతున్నారు. అప్పటికే ఏదొకటి అర్థం చేసుకుని ప్రశ్నలకు సమాధానాలు రాసిన వారు మళ్లీ వాటిని కొట్టివేసి రాయాల్సి వస్తోందని వాపోతున్నారు.