ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో లేటెస్ట్ అప్‌డేట్‌.. వారిని మ‌రోసారి విచారించాలి – ఈడీ

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా భావిస్తున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైతోపాటు క‌విత మాజీ ఆడిట‌ర్ బుచ్చిబాబును మ‌రోసారి విచారించాలని ఈడీ భావిస్తోంది. దీంతో మ‌రోసారి వారిద్ద‌రికీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ తేదీన తమ ముందు హాజరు కావాలని అందులో ఈడీ ఆదేశించింది. అయితే అంత‌కు ముందు ఢిల్లీ కోర్టులో అరుణ్‌ రామచంద్ర పిళ్లై పిటిష‌న్ దాఖ‌లు చేశార‌. ఇటీవ‌ల ఈడీ త‌న నుంచి తీసుకున్న వివ‌రాల‌ను తాను వెన‌క్కు తీసుకుంటాన‌ని, ఈడీ ఒత్తిడితోనే కొన్ని విష‌యాల‌ను తెలియ‌జేశాన‌ని ఆయ‌న ఈడిపై రిట్ పిటిష‌న్ వేశారు. ఈనేప‌థ్యంలో ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో సోమవారం ఈడీ ఇవాళ అరుణ్‌ రామచంద్ర పిళ్లైను హాజరుపర్చి.. కీలక వాదనలు వినిపించింది. తన వాంగ్మూలం ఉపసంహరించుకునేందుకు ఆయన స్పెషల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. పిటిషన్‌పై సోమ‌వారం విచారణ జరిగింది. ‘‘చాలా కీలక సమయంలో పిళ్ళై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. పిళ్ళై విచారణకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయి. విచారణ సమయంలో పిళ్లైను ఒత్తిడి చేయలేదు, బెదిరించలేదు. టార్చర్‌ కూడా చేయలేదు’’ అని ఈడీ కోర్టుకు తెలిపింది

ఓ వ్య‌క్తికి నోటీసులు ఇచ్చిన త‌ర్వాతే పిళ్లై ఇలా చేస్తున్నారు..
పిళ్లై ని గ‌త ఏడాది సెప్టెంబరు 18న తొలిసారి విచారించి పూర్తి స్టేట్మెంట్ రికార్డు చేసిన‌ట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. రెండు, మూడు స్టేట్మెంట్లలో తీసుకున్న‌ప్పుడు కూడా ఆయన ఒక‌ర‌క‌మైన వివరాలు త‌మ‌కు తెలియ‌జేసిన‌ట్లు ద‌ర్యాప్తు సంస్థ పేర్కొంది. ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్ లలో ఎలా కన్ఫర్మ్ చేస్తారు?. మార్చి తర్వాతే స్టేట్ మెంట్ మార్చుకున్నారు?. ఆయన స్టేట్ మెంట్ ఎందుకు మార్చుకున్నారో అంద‌రికీ ఇప్పుడు అర్థ‌మ‌వుతోంద‌ని ఈడీ అధికారులు తెలిపారు. ఓ వ్య‌క్తికి ఇటీవ‌ల తాము నోటీసులు ఇచ్చిన త‌ర్వాత పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకుంటున్న‌ట్లు ఈడీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో.. కోర్టు తీర్పును వాయిదా వేసింది. అయితే బుచ్చిబాబుతో కలిపి పిళ్లైని మరోసారి విచారించాలని కోర్టును ఈడీ కోరింది. మరో మూడు రోజులు తమ కస్టడీకి వారిని అప్ప‌గించాల‌ని కోర్టును అడ‌గ‌గా.. దీనికి దీనికి కోర్టు అంగీక‌రించింది.