హాస్పిటల్​లో చేరిన ఖుష్బూ.. జాగ్రత్త అంటూ ఎమోషనల్ పోస్ట్​!

సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ రాణిస్తున్న సీనియర్​ నటి ఖుష్బూ సుందర్​ ఆసుపత్రి పాలయ్యారు. 5 నెలలు కిందటే వెన్నెముక సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఖుష్బూ చికిత్స అనంతరం ఆరోగ్యంగా తిరిగొచ్చారు. అప్పటినుంచీ పలు సినిమాలు, రాజకీయ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు. ప్రముఖ తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న ఓ కామెడీ షో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఇటీవలే జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు ఖుష్బూ. ఇక, తాజాగా ఆమెకు అడెనో వైరస్‌ సోకడంతో మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయాన్నితన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఖుష్బూ స్వయంగా అభిమానులతో పంచుకున్నారు.

ఆసుపత్రిలో ఉన్న తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఖుష్బూ ఎమోషనల్​ పోస్ట్​ చేశారు. ‘అడెనో వైరస్‌ చాలా ప్రమాదకరమైనది. దానిని ఎవరు తక్కువ అంచనా వేయవద్దు. అది నా పై చాలా దుష్ప్రభావం చూపింది. హై ఫీవర్, తీవ్రమైన ఒంటినొప్పులు వచ్చి బాగా బలహీన పడిపోయాను. ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అలాగే మీకు కూడా ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తం అవ్వండి. జాగ్రత్త వహించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ అభిమానులకు జాగ్రత్తలు చెప్పారు. అంతేకాదు ఆ పోస్ట్ తో పాటు హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను కూడా జత చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటే వైరల్ అవుతుంది. ఇక ఖుష్బూ షేర్​ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ.. త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తున్న ఖుష్బూ జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలి పదవి చేపట్టిన దగ్గర నుంచి కొత్త సినిమాకి సైన్ చేయడం లేదని తెలుస్తోంది. ఖుష్బూ సినిమాలను వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి వెళతారని ప్రచారం కూడా జరుగుతోంది.