BJPలోకి కిచ్చా సుదీప్‌.. కర్ణాటకలో పవన్‌ ప్రచారం!

కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయ హీట్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా పార్టీల్లో పేరున్న నాయకులను, సెలబ్రిటీలను ఆకర్షించే పనిలో బీజేపీ కేంద్ర నాయకత్వం నిమగ్నమైంది. అయితే.. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం.. కర్ణాటకకు చెందిన పలువురు సినీ ప్రముఖులు బీజేపీ తీర్థం స్వీకరించనున్నారు. అందులో ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ (కిచ్చా సుదీప్), దర్శన్ తూగుదీప బుధవారం భారతీయ జనతా పార్టీ లో చేరనున్నట్లు కమలనాథులు ప్రకటించారు. కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నటుడు సుదీప్ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. బెంగళూరులో కర్ణాటక సీఎం బొమ్మై, ఇతర పార్టీ నేతల సమక్షంలో కిచ్చా సుదీప్, దర్శన్ తూగుదీప పార్టీలో చేరనున్నారు. దీంతో వీరిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుని ఓట్లు పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

జనసేన అధినేత పవన్‌ అక్కడ ప్రచారం చేస్తారా..
మరో నెలరోజుల్లో కర్నాటకలో జరగనున్న ఎన్నికల్లో ఏవిధంగైనా గెలవాలని.. అధికార బీజేపీ గట్టిగా భావిస్తోంది. దీనిలో భాగంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. దీనిలో భాగంగా ఏపీకి చెందిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ పెద్దలు రెండ్రోజుల కిందట ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఈ సందర్బంగా పవన్‌ను కర్నాటకలోని తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయాలని బీజేపీ కోరినట్లు సమాచారం. సహజంగా పవన్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఫాలోయింగ్‌ ఉంది. ఈక్రమంలో ఆ చరీష్మాను కర్నాటకలో కూడా వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోందట. దీనిలో భాగంగానే పవన్‌ను ఢిల్లీకి పిలిపించిందని అందరూ అనుకుంటున్నారు. మరి ఆయన బీజేపీ తరపున ప్రచారం చేస్తారో లేదో వేచి చూడాలి.