Karnataka Elections: ఎన్నికల వేళ హీరో సుదీప్​ కామెంట్స్​!

Karnataka: నేటి ఉదయం నుంచీ కర్ణాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Karnataka Elections 2023) జరుగుతున్న విషయం తెలిసిందే. రాబోయే పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో కన్నడ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందా? అని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కర్ణాటకలోలోని సాధారణ ప్రజల నుంచి స్టార్ హీరోలు వరకు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) తరపున కన్నడ స్టార్​ హీరో కిచ్చ సుదీప్(Sudeep)​ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగా సుదీప్​ చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.

కన్నడ హీరో సుదీప్ ఈ ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజు బొమ్మై తరపున ప్రచారం చేశారు. కాగా, కుటుంబంతో సహా ఎన్నికల బూతుకి వచ్చిన ఆయన ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చెప్పినంత మాత్రాన ప్రతి ఒక్కరు ఓట్లు వేసేయ్యరు. ఓటు హక్కుని ఉపయోగించుకోవడం పౌరులుగా ప్రతిఒక్కరి బాధ్యత. 21 శాతమే పోలింగ్ నమోదు అయిందంటే షాకింగ్ గా ఉంది. అందరూ ముందుకు రావాలి. ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. నేను సమాజానికి సందేశాలు ఇవ్వడం లేదు. ఓటు ఎంతోమంది భవిష్యత్ ను నిర్ణయిస్తుంది. ఓటు వెయ్యని వాళ్ళు దాని ఫలితాన్ని అనుభవిస్తారు. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ప్రస్తుతం నాకు రాజకీయాల్లోకి రావాలని లేదు. దశాబ్దాల కాలం పాటు నటుడిగానే ఉండాలనుకుంటున్నా. రాజకీయాల్లోకి వచ్చే అనుభవం, ఆలోచన అసలు లేదు. ఈ ఎన్నికల్లో కూడా నేను బీజేపీ(BJP) తరపున ప్రచారం చేయలేదు. కేవలం బసవరాజు బొమ్మై కోసమే ప్రచారం చేశా’ అన్నారు. దీంతో ఎన్నికల వేళ సుదీప్​ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.