రిజిస్ట్రేషన్‌ చేయనంటే పెట్రోల్‌ పోస్తాం.. తహసీల్దార్‌కు బెదిరింపులు!

‘భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం, రిజిస్ట్రేషన్‌ చేయండి.. లేదంటే పెట్రోల్‌పోసి చంపుతాం’ అని పోలీసుల ముందే ఓ మహిళా తహసీల్దార్‌ను కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత తహసీల్దార్‌ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిల్‌నాయక్‌ తండాకు గుగులోత్‌ పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్‌ చేయాలని స్లాట్‌ బుక్‌ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్‌ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంకు నుంచి నోడ్యూస్‌ సర్ఠిఫికెట్‌ తీసుకురావాలని సూచించారు.

ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో బిల్‌నాయక్‌ తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్‌ కార్యాలయంలోకి ప్రవేశించి ‘స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం రిజిస్ట్రేషన్‌ చేయండి. నోడ్యూస్‌ ఎందుకు తీసుకురావాలి’ అంటూ తహసీల్దార్‌ను నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, వారి ముందే రిజిస్ట్రేషన్‌ చేయకపోతే నీపై పెట్రోల్‌ పోసి చంపేస్తామని తహసీల్దార్‌ను నానా దుర్భాషలాడారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తహసీల్దార్‌ దూలం మంజుల తెలిపారు. గతంలో ఇదే విధంగా హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంఘటన పెద్ద దుమారం రేపింది. ఈక్రమంలో ఇదే విధంగా కొందరు మహిళా తహసీల్దార్‌ను బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశమైంది.