ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

ఒక కాన్పులో ఒకరు లేదా కవలలు పుట్టడం అనేది సర్వసాధారణం.. కొన్ని సందర్బాల్లో ఎక్కడైనా ముగ్గురు పిల్లలు కూడా పుడుతుంటారు. ఒకే నలుగురు పిల్లలు జన్మించిన సందర్భాలు చాలా అరుదు. కానీ ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. అక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు కోసం చేరిన మహిళ ఏకంగా నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే.. తల్లి, పిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో కన్నవారికి, బంధువుల ఆనందానికి అవధుల్లేవు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టుముక్కల లావణ్య కాన్పు కోసం ముస్తాబాద్ మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇటీవల చేరారు. ఇది ఆమెకు రెండో కాన్పు. మొదటి కాన్పులో బాబు పుట్టగా.. అతనికి ఇప్పుడు తొమ్మది సంవత్సరాలు ఉంటాయి. అయితే రెండో కాన్పులో మొత్తం ముగ్గురు బాబులు, ఓ పాప జన్మించారు. పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. వీరిని మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట పిల్లల ఆసుపత్రికి తరలించారు.