KCR సలహాదారుగా మాజీ సీఎస్​ సోమేశ్​ కుమార్​!

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)లో సుదీర్ఘ కాలం సీఎస్‌(Chief secretary)గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌ సోమేష్‌ కుమార్‌(Somesh Kumar)ను కీలక పదవిలో నియమించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు(K. Chandrashekar Rao). ఈ మేరకు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా సోమేష్‌ కుమార్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కేబినేట్ హోదాతో నియమించారు. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల కాలం పాటు కొనసాగనున్నారు.
కాగా, బిహార్‌(Bihar)కు చెందిన సోమేశ్ కుమార్ తెలంగాణలో పలు కీలక బాధ్యతల్లో పనిచేశారు. 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి సోమేష్ కుమార్ తెలంగాణ సీఎస్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే.. సోమేష్‌ కుమార్ ఏపీ కేడర్‌కు చెందిన అధికారి అంటూ.. దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆయనను సీఎస్‌గా తొలగించి ఆ స్థానంలో శాంతి కుమారిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ, ఏపీకి వెళ్లటం ఇష్టంలేని సోమేష్ కుమార్​ కోర్టు ఆదేశాల మేరకు అక్కడ రిపోర్ట్ చేసినా.. ఆ తర్వాత వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు ఆయన పదవికాలం ఉన్నా.. ఏపీ(Andhra Pradesh)లో రిపోర్ట్ చేసిన నెల రోజులకే వీఆర్ఎస్ తీసుకున్నారు. అప్పట్లో వినపడిన వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాన సలహాదారుగా పనిచేయబోతున్నారు.