బొలెరోని ఢీకొన్న దురంతో ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది. రైలు వస్తుందని అప్పటికే అక్కడి సిబ్బంది గేటు వేసినా.. బొలెరో వాహనం రైలు పట్టాల వైపు దూసుకొచ్చింది. గేటును మూసివేసినా… బొలెరో వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాహనం సరిగ్గా రైల్వే ట్రాక్‌పైన ఆగిపోయింది. అదే సమయంలో రైలు దూసుకొస్తుండడంతో వారు వాహనం దిగి పరారయ్యారు. వేగంగా వచ్చిన రైలు వాహనాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా, రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతింది. రైలు ఇంజిన్ దెబ్బతినడంతో దాదాపు ఐదు గంటల పాటు రైలు ట్రాక్‌పైనే నిలిచిపోయింది. దీంతో మరో కొత్త ఇంజిన్ తీసుకొచ్చి రైలుకు అమర్చి పంపేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
బొలిరే వాహనంలో వచ్చిన వారు ఎవరూ అని పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. వారు బర్రెల దొంగలుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఉదయాన్నే సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ట్రాక్‌పై నుంచి బొలెరోను తొలగించారు. అయితే, రైలు ఇంజిన్ దెబ్బతినడంతో మరో ఇంజిన్‌ను తెప్పిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు వాహనంలో వచ్చింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. వారు దొంగలు అయి ఉండొచ్చని, పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.