సీఎం జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో ఇవాళ పర్యటించిన ఆయన.. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర సెల్ఫీ దిగారు. దాన్ని కోట్‌ చేస్తూ.. ”చూడు….జగన్!.. ఇవే టీడీపీ హయాంలో.. పేదలకు కట్టించిన వేలాది టిడ్కో ఇళ్లు. ఏపీలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం. నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని?.. నువ్వు కట్టిన ఇళ్లెక్కడా?.. జవాబు చెప్పగలవా? ” అంటూ జగన్ను ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో చంద్రబాబు ట్వీట్ చేశారు. తన సెల్ఫోన్తో టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర.. సెల్ఫీ దిగి చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. అయితే.. గత కొద్ది రోజులుగా చంద్రబాబు తనయుడు.. నారా లోకేష్‌ కూడా.. ఈ సెల్ఫీ ఛాలెంజ్‌ విసురుతూ వస్తున్నారు. ఆయన చేపట్టిన యువగళం యాత్రలో భాగంగా టీడీపీ హయాంలో నెలకొల్పిన పరిశ్రమలు, ఇతర సముదాయాల వద్ద సీఎం జగన్‌, వైసీపీ పార్టీ నాయకులకు సెల్ఫీ ఛాలెంజ్ విసురుతూ వస్తున్నారు. ఈక్రమంలో చంద్రబాబు సైతం సెల్ఫీ ఛాలెంజ్‌ విసరడం హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు ఇప్పటికే టీడీపీ క్యాడర్‌కు, లీడర్స్కు చంద్రబాబు ఇదే విధంగా తమ ప్రాంతంలో సెల్ఫీలు దిగి ట్విట్టర్‌లో పోస్టు చేయాలని పిలుపునిచ్చారు. అయితే.. తొలిసారి ఈ సెల్ఫీ విధానాన్ని జనసేన పార్టీ తీసుకొచ్చింది. రాష్ట్రంలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చూపుతూ అప్పట్లో జనసేనా పవన్‌తో సహా .. ఆ పార్టీ నాయకులు పాడైపోయిన రోడ్ల ఫొటోలు ట్విట్టర్‌లో పెట్టారు. ప్రస్తుతం టీడీపీ నాయకులు కూడా అదే పనిచేస్తూ.. వైసీపీపై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు.