brs formation day: గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ దిశానిర్దేశం

hyderabad: తెలంగాణ భవన్‌(telangana bhavan)లో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ(brs formation day) కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌(cm kcr) పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇలా మొత్తం 279 మంది ప్రతినిధులు సమావేశానికి వచ్చారు. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరించారు. అయితే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కార్యాచరణ ఏవిధంగా ఉంటుంది అన్నదానిపై ప్రత్యేక కథనం.

సరిగ్గా.. 22 ఏళ్ల కిందట టీఆర్‌ఎస్‌(trs) పార్టీ ఆవిర్భవించింది.. ఆ తర్వాత గత ఏడాది విజయదశమినాడు బీఆర్‌ఎస్‌(brs)గా రూపాంతరం చెందింది. 14 ఏళ్ల స్వరాష్ట్ర ఉద్యమ ప్రస్థానం, ఎనిమిదిన్నర ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కార్‌ కొలువుదీరింది. ఇక ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, పథకాల గురించి వివరించాలని కేసీఆర్‌ నాయకులకు స్పష్టం చేయనున్నారు. అదేవిధంగా బీజేపీ(bjp), కాంగ్రెస్‌(congress) సహా పలు పార్టీలు బీఆర్‌ఎస్‌పై కావాలని బురదజల్లే కుట్రలు ఎలా చేస్తున్నారు? వాటిని ఎలా తిప్పికొట్టాలి? క్షేత్రస్థాయిలో ప్రజలతో పార్టీ శ్రేణులు ఎలా మసలుకోవాలి? వంటి అంశాలపై అధినేత కీలక సూచనలు చేయనున్నారు. దీంతోపాటు కీలక రాజకీయ తీర్మానాలు, పార్టీ పరిపాలనా తీర్మానాలు ఉండే అవకాశాలున్నాయి.