కదులుతున్న కారులోనే యువతిపై అత్యాచారం

మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్న మృగాలకు ఎలాంటి శిక్షలు విధిస్తున్నా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వారిపై ఆగడాలు మాత్రం నిలువరించలేకపోతున్నారు. తాజాగా బెంగళూరులో నగరంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి నలుగురు దుండగులు… సుమారు 19 సంవత్సరాలు ఉండే ఆ యువతిపై కారులోనే అఘాయిత్యానికి ఒడిగట్టారు.

స్నేహితుడితో కలిసి బయటకు వచ్చిన యువతి..
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఓ పార్కులో తన స్నేహితుడితో కలిసి సదరు యువతి కూర్చుని మాట్లాడుతోంది. ఈక్రమంలో అక్కడికి నలుగురు దుండగులు కారులో వచ్చారు. ఆమె స్నేహితుడిని బెదిరించి.. బలవంతంగా దుండగులు ఆ యువతిని కారులో ఎత్తుకెళ్లారు. అనంతరం కదులుతున్న కారులోనే అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నగరంలోని దోమ్లూర్, ఇందిరానగర్, అనేకల్.. తదితర ప్రాంతాల వైపు కారును నడుపుతూ.. దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున తన ఇంటికి సమీపంలో రోడ్డుపక్కన వదిలి వెళ్లిపోయారని పేర్కొంది.

అత్యాచారం అనంతరం బెదిరింపులు..
అత్యాచారం చేసిన సంగతి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు నిందితులు బెదిరించారని యువతి పేర్కొంది. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న యువతి… కోరమంగళ నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కు వద్ద రాత్రి 9.30 గంటల సమయంలో కూర్చొని ఉండగా.. నలుగురు యువకులు అక్కడికి వచ్చి బలవంతంగా కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారని చెబుతోంది. ఇక ఇంటికి చేరుకున్నాక ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను నగరంలోని ఇజీపురాకు చెందిన సతీశ్, విజయ్, శ్రీధర్, కిరణ్ ను అరెస్టు చేశారు. వీరి వయసు 22 నుంచి 26 ఏళ్ల లోపే ఉంటుందని పోలీసులు వెల్లడించారు.