బెంగుళూరులో వందే భారత్ రైలుపై దాడి

దేశంలోని ప్రముఖ పట్టణాల మధ్య పరుగులు తీస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు రాళ్ల దెబ్బలు తప్పటంలేదు.  వందే భారత్ రైళ్లపై దాడులను రైల్వే శాఖ తీవ్రంగానే పరిగణించింది. దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా సరే ఆకతాయిల దాడులకు తెరపడటం లేదు. వందే భారత్ రైళ్లపై ఆకతాయిల రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. ముందు నుంచే ఈ రాళ్ల దాడి బెడదను ఎదుర్కొంటున్న వందే భారత్ తాజాగా మరోసారి అదే ఘటన పునరావృతమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో దాడులు జరుగగా, తాజాగా  చెన్నై-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై దాళ్ల దాడి జరిగినట్టు నైరుతి రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో పలు రైలు కోచ్‌ల కిటికీ అద్దాలు ధ్వంసం కాగా.. ఒకరు గాయపడినట్టు పేర్కొంది. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసినట్టు అధికారులు తెలిపారు.

‘రైలు నెంబరు 20608 మైసూరు -చెన్నై వందే భారత్ రైలుపై ఆకతాయిలు రాళ్ల దాడికి పాల్పడ్డారు.. ఈ దాడిలో ఒకరికి గాయాలయ్యాయి.. కృష్ణరాజపురం, బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది’ అని పేర్కొంది. వందే భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చెన్నై-మైసూరు రైలును గత డిసెంబరులో ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ముఖ్యమైన నగరాల మధ్య రైళ్లను ప్రయోగాత్మకంగా నడుపుతోంది. కానీ, కొన్నిచోట్ల వందే భారత్ రైళ్లపై ఆకతాయిల దాడులు కొనసాగుతున్నాయి.

రైళ్లను ప్రారంభించిన చోట్ల ఇటీవల పలుమార్లు వందే భారత్ రైలుపై దాడులు జరిగాయి. నైరుతి రైల్వే పరిధిలోని జనవరి నెల 21 కేసులు నమోదుకాగా.. ఫిబ్రవరిలో ఇప్పటి వరకూ 13 కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం, విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల రాళ్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అద్దాలను అధికారులు మార్చాల్సి వచ్చింది. ఖమ్మం, విశాఖ ఘటనలలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని చట్టపరంగా నేరంగా పరిగణిస్తామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. దీంతో ఎవరైనా అలా చేస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు. అయినప్పటికీ చాలామంది ఆగంతకులు రైళ్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలా.. పదేపదే వందే భారత్​ రైళ్లపై రాళ్ల దాడి జరగడంపై రైల్వే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.