భట్టిప్రోలులో దారుణం.. బాలికపై వృద్ధుడి అత్యాచారం!

సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. వయసులో మనవరాలు అయ్యే బాలికపై ఓ వృద్దుడు కన్నేశాడు. ఏవేవో మాటలు చెప్పి మైనర్‌ను బుట్టలో వేసుకున్నాడు. ఇక ఇదే అదునుగా భావించిన అతను ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికొచ్చిన బాలిక ఏడుస్తుండటం గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని చిన్నారిని ప్రశ్నించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బాలికను పొలాల్లోకి తీసుకెళ్లిన నిందితుడు..
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు 11 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని మొక్కజొన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఏడుస్తుండటంతో ఆమె తల్లి గమనించి విషయం అడగగా
జరిగిన సంగతి చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.

కనురెప్పలే కాలనాగులు..
వయసు, చిన్నా పెద్దా, వావీ వరస అన్న తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ అగాయిత్యాలు గ్రామాలు లేదా పేద వర్గాలకు మాత్రమే పరిమితం కావట్లేదు. డబ్బున్న వారు చదువుకున్న వారు సైతం అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సినీనటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్భూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే కన్న తండ్రే లైంగికంగా వేధింపులకు పాల్పడేవాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె కాదు.. దిల్లీ మహిళ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మానివాల్‌ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బంధువులు, స్నేహితులే బాలికలు, యువతులు, మహిళల పట్ల అకృత్యాకులకు పాల్పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.