ప‌టిష్ట భ‌ద్ర‌తతో ఏపీ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు.. కేంద్రాల వ‌ద్ద ఇవి ఉండాలి!

ఏపీలో ప‌రీక్ష‌ల సంద‌డి మొద‌లైంది. తొలుతు ఈ నెల 15 నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు వంటి అంశాల‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఇంటర్మీడియట్ పరీక్షలకు రాష్ట్రంలో మొత్తం 10 లక్షల 3వేల 674 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారిలో 4 లక్షల 84 వేల 12 మంది మొదటి సంవత్సరం పరీక్షలకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5 లక్షల 19 వేల 662 మంది హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1489 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన‌ట్లు సీఎస్ తెలిపారు. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12గం.ల వరకూ జరుగుతాయ‌న్నారు.

ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల‌ను ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచడంతోపాటు తగిన పస్ట్ ఎయిడ్ కిట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. 20-25 పరీక్షా కేంద్రాలకు కలిపి ఒక 108 అంబులెన్సు సేవలను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు.

ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఆయా రూట్లలో తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా పరీక్షలు జరిగే సమయంలో ప్రశ్నాపత్రాలు లీకేజి లేదా మాల్ ప్రాక్టీస్ వంటి వదంతులు సృష్టించి విద్యార్థులను ఆందోళనలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయని అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. జిల్లా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్లు ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.

అదే విధంగా పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమీషనర్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి యం.వి.శేషగిరి బాబు పాల్గొనగా వీడియో లింక్ ద్వారా పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఆర్టీసీ యండి.ద్వారకా తిరుమల రావు పాల్గొన్నారు.