చ‌దువు MS.. వృత్తి ఫేక్‌ కాల్‌ సెంటర్‌!

అతను బీటెక్‌ చదివాడు.. ఆపై యూకేలో ఎంఎస్‌ పూర్తి చేసి.. ఇప్పుడు లండన్‌లో ఓ సూపర్‌ మార్కెట్‌ నిర్వహిస్తూనే, విదేశాలకు విద్యార్థులను పంపే కన్సల్టెన్సీని నడుపుతున్నాడు. ఇక్కడి వరకు ఏ సమస్యా లేదు. అయితే.. అతనికి ఉన్నట్టుండి అక్రమంగా అధికంగా డబ్బు సంపాదించాలని భావించాడు. అమెజాన్‌ ఫ్రైమ్‌ ఖాతాదారులను మోసం చేయాని ఓ నకిలీ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. భారతీయులను కాకుండా విదేశీయులను మోసం చేస్తే అధికంగా డబ్బు వస్తుందని పథకం వేసి.. ఆ ప్రయత్నంలోనే పోలీసులకు ఈ వ్యవహారం అంతా తెలియడంతో బొక్కబోర్లా పడ్డాడు. ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి..

వరంగల్‌ జిల్లాలోని హనుమకొండకు చెందిన వీరె ప్రమోద్‌ కుమార్‌ రెడ్డి.. ఎంఎస్‌ చేసి.. కన్సల్టెన్నీని నడుపుతున్నాడు.. ఈక్రమంలో రమేష్‌ అనే వ్యక్తి అతనికి పరిచయం అయ్యాడు. సైబర్‌ క్రైమ్‌లకు పాల్పడి డబ్బు అక్రమంగా సంపాదించాలని ప్రమోద తన ప్లాన్‌ను రమేషకు వివరించాడు. ఇంకేముంది వెంటనే దాని అమలుకు అవసరమైన ఏర్పాట్లను చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రమోద్‌ చిన్ననాటి స్నేహితుడు అజయ్‌కు చెప్పడంతో పేట్‌ బషీరాబాద్‌లో నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేద్దామని అతను సూచించాడు. అజయ్‌కు పరిచయం ఉన్న రామకృష్ణను సాయం తీసుకుని.. ఓ పదిహేను రోజుల కిందట.. బషీరాబాద్‌ యారో ఎస్టేట్‌ మొదటి అంతస్తులో కాల్‌ సెంటర్‌ను ప్రారంభించారు.

వారి టార్గెట్‌ ఆస్ట్రేలియా.. రెండు ప్లాన్లు వేశారు..
ప్రమోద్‌.. అతని స్నేహితులైన రమేష్‌ కుమార్‌, శబరీష్‌ ద్వారా హైదరాబాద్‌లో కాల్‌సెంటర్‌ నిర్వహణలో అనుభవం ఉన్న కొంతమంది సిబ్బందిని నియమించుకున్నారు. అనంతరం ముందుగానే పథకం రచించిన విధంగా ఆస్ట్రేలియాకు చెందిన వారిని మోసం చేసేందుకు గాను.. అక్కడి వారి డేటా కోసం కోల్‌కతాకు చెందిన ఆకాష్‌, లెస్లీ సాయం తీసుకుని డేటా సేకరించారు. ముందుగానే తీసుకున్న డేటా ప్రకారం.. ఆస్ట్రేలియాలో ఉన్న పలువురికి కాల్‌ చేసి మీ అమెజాన్‌ ఫ్రైమ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని, వేరే వాళ్లు వినియోగిస్తున్నారని టెలీ కాలర్స్‌తో చెప్పించేవారు. ఒకవేళ వారు తమకు ప్రైమ్‌ అకౌంట్‌ లేదని చెబితే కాల్‌ కట్‌ చేసేవారు. అకౌంట్‌ ఉన్న వారైతే.. మీతో మా సూపర్‌ వైజర్‌ మాట్లాడతాడని చెప్పి ప్రమోద్‌కి కాల్‌ కనెక్ట్‌ చేసేవారు.. ప్రమోదుకు ఇంగ్లిష్‌ యాక్సెంట్‌ బాగా రావడంతో అక్కడి పౌరులను నెమ్మదిగా ఉచ్చులోకి దింపేవారు. అకౌంట్‌ వేరే డివైజ్‌ నుంచి తీసేయడానికి హ్యాక్‌ అవకుండా ఉండటానికి వెయ్యి డాలర్లు ఖర్చు అవుతుందని అందుకు.. యూపీఐ లింక్‌ మొబైల్‌ నంబర్‌కు పంపుతామని చెప్పేవాడు. ఇక ఆ లింక్‌ ఓపెన్‌ చేసిన దగ్గరి నుంచి ఆ ఫోన్‌ను ప్రమోద్‌ ఆపరేట్‌ చేసేవాడు. అలా పలువురి అకౌంట్లను నుంచి డబ్బును కాజేసేందుకు యత్నించగా.. బ్యాంకు వారు లావాదేవీలలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించి ప్రమోద అకౌంట్లను బ్లాక్‌ చేశారు. దీంతో తొలి ప్లాన్‌ విఫలం అయ్యింది. ఇక రెండో ప్లాన్‌ అమెజాన్‌ పేరుతో నకిలీ గిఫ్ట్‌ కూపన్లు ఆస్ట్రేలియా పౌరులకు పంపి.. వాటిరి రీడెమ్‌ చేస్తే.. ఆ అమౌంట్‌ మన దేశ బ్యాంకు ఖాతాలో పడేలా ప్లాన్‌ చేశారు. కానీ ఇది కూడా వర్కౌట్‌ కాలేదు. ఈక్రమంలో ఓ వ్యక్తి డైల్‌ 100కు ఫోన్‌చేసి పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల రంగప్రవేశంతో..
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పేట్‌ బషీర్‌బాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న యారో ఎస్టేట్‌లో పేరు లేకుండా కాల్‌ సెంటర్‌ నడుపుతున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డిఐజీ సందీప్‌ ఆధ్వర్యంలో పలువురు పోలీసులు, సైబరాబాద్ పోలీసులు కాల్‌ సెంటర్‌లోకి ప్రవేశించి అక్కడి వారిని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అక్కడ పనిచేస్తున్న కాల్‌ సెంటర్‌ సిబ్బంది 13 మందితోపాటు ప్రమోద్‌ను అరెస్ట్ చేశారు. ఘటనా స్థలం నుంచి 13 డెస్క్‌టాప్ మానిటర్లు, 14 సీపీయూలు, 13 హెడ్‌సెట్‌లు, ఒక హార్డ్ డిస్క్, ఒక పెన్ డ్రైవ్, ఒక మెమరీ కార్డ్, ఎనిమిది కొత్త సిమ్ కార్డ్‌లు, 18 మొబైల్ ఫోన్‌లు, రెండు డీజిల్ మేక్ రిస్ట్‌వాచ్‌లు సహా పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక హిల్ ఫింగర్ చేతి గడియారం, ఒక ఫార్చ్యూనర్ కారు, ఆరు వేల నగదు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మీడియాకు వివరాలు అందజేశారు.