వ్యసనాలకు బానిసైన తల్లి.. కన్న కొడుకునే చంపేసింది!

వ్యసనాలు, విలాసలకు భానిసైన ఓ తల్లి… నవమాసాలు మోసి కనిపెంచిన కన్న కొడుకుని గొంతు నులిమి చంపేసింది. అనంతరం పక్కనే ఉన్న కెనాల్లో మృతదేహాన్ని పడేసింది. ఇదంతా మద్యం మత్తులోనే చేయడం గమనార్హం.. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది.

నిజామాబాద్‌ టౌన్‌లోని నాగారం సమీపంలో ఉన్న సంతోష్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉండే లావణ్య, భరత్‌ దంపతులకు కుమారుడు రోహిత్‌ (8 )ఉన్నాడు. గత కొంతకాలం నుంచి లావణ్య మద్యానికి బానిసై విలాసాలకు అలవాటు పడింది. మంగళవారం సాయంత్రం లావణ్య కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి బయల్దేరింది. ఈక్రమంలో కారణం ఏమైందో ఏమిటో తెలియదు.. మ‌ద్యం మ‌త్తులో రోహిత్ గొంతు నులిమి, నిజాం సాగ‌ర్ కెనాల్‌లో ప‌డేసింది ఆ తల్లి. మత్తులో ఉన్న ఆమె తెల్లవారేసరికి అక్కడే ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను విచారించి భర్తకు సమాచారం అందించారు. భర్త భరత్‌ ఫిర్యాదు మేరకు నిందితురాలిని అదుపులోకి విచారించగా.. కొడుకుని చంపినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె మద్యం మత్తులో హత్య చేసిందా? లేదా ఎవరితోనైనా కలిసి చేసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.