Adipurush: “డైలాగ్స్ మార్చ‌మ‌ని చెప్పినా విన‌లేదు”

Adipurush: ప్ర‌భాస్ (Prabhas) రాముడి పాత్ర‌లో.. కృతి స‌న‌న్ (Kriti Sanon) సీత‌మ్మ‌వారి పాత్ర‌లో న‌టించిన ఆదిపురుష్ సినిమాపై ఏ రేంజ్‌లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు ఓం రౌత్ (Om Raut) పేరు వింటేనే ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతుంటారు. ఓం రౌత్ కనిపిస్తే ప‌ళ్లు రాల‌గొడ‌తారేమో అనేంత క‌సిగా ఉన్నారు. అయితే ఈ సినిమా తీస్తున్న‌ప్పుడే ఇందులోని న‌టీనటులు డైలాగులు మార్చండి.. మ‌నం రామాయ‌ణంలోని ఓ ఘ‌ట్టాన్ని చూపిస్తున్నాం. ప్రేక్ష‌కులు తిట్టుకుంటారు ఇలాంటి డైలాగులు పెడితే అని ద‌ర్శ‌కుడికి చెప్పార‌ట‌. అయినా కూడా ఓం రౌత్ వినిపించుకోకుండా.. ఈ స్టైల్‌లో తీస్తే ఇప్ప‌టి పిల్ల‌లు కూడా క‌నెక్ట్ అవుతారు అని చెప్పాడట‌.

ఈ విష‌యాన్ని బాలీవుడ్ న‌టుడు విందు ధారా సింగ్ ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు. చాలా సినిమాల్లో హ‌నుమంతుడి పాత్ర‌లో విందు ధారా సింగ్ న‌టించారు. ఆదిపురుష్ సినిమా తీస్తున్న స‌మ‌యంలో టీంలోని కొంద‌రు వ్య‌క్తుల‌తో విందు ధారా సింగ్ మాట్లాడార‌ట‌. వారు కూడా డైలాగులు ర‌చ్చ లేపే విధంగా ఉన్నాయ‌ని అన్నార‌ట‌. దీని గురించి ఓం రౌత్‌కి చెప్తే ఏం ఫ‌ర్వాలేదు ఇలా తీస్తే కొత్త‌గా ఉంటుంది అన్న‌ట్లు విందు తెలిపారు. రావ‌ణ లంక‌ను న‌ల్ల‌గా చూపించి మ‌రో పెద్ద త‌ప్పు చేసాడ‌ని.. లంక బంగారు వ‌ర్ణంలో ఉంటుంద‌ని విందు తెలిపారు. ఓ ద‌ర్శ‌కుడు, నిర్మాతకు ఇంత అనుభ‌వం ఉండి కూడా ఇలాంటి ఓ సినిమా తీసేట‌ప్పుడు ఇన్ని త‌ప్పులు ఎలా చేసారో తన‌కు ఇప్ప‌టికీ అర్థం కావ‌డంలేద‌ని విందు ధారా సింగ్ అభిప్రాయ‌ప‌డ్డారు.