వెన్నెల కిషోర్​ హోస్ట్​గా ‘అలా మొదలైంది’!

ఈతరం కమెడియన్లలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్​ క్రియేట్​ చేసుకున్న నటుడు వెన్నెల కిషోర్. తన కామెడీ టైమింగ్​, డైలాగ్​ డెలివరీ, ఎక్సప్రెషన్స్​తో తక్కువ సమయంలోనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల కమెడియన్​గా గుర్తింపు తెచ్చుకున్నారు కిషోర్​. సినిమాలపై మక్కువతో సాఫ్ట్​వేర్​ ఉద్యోగాన్ని వదులుకున్న కిషోష్​ తన మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకుని నటనపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. ఇక, ఇన్నాళ్లూ వెండితెరపై నవ్వులు పూయించిన కిషోర్​ ఇప్పుడు బుల్లితెరపైనా నవ్వించేందుకు వచ్చేస్తున్నారు. ఈటీవీలో ప్రారంభం కానున్న సరికొత్త టాక్​ షో ‘అలా మొదలైంది’ కార్యక్రమానికి యాంకర్​గా వ్యవహరించనున్నారు కిషోర్​. అలా మొద‌లైంది షోను ప్ర‌ముఖ టాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే అలా మొద‌లైంది షో ఈటీవీలో టెలికాస్ట్ కానున్న‌ట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప్ర‌క‌టించింది.

సినిమా, స్పోర్ట్స్ సెల‌బ్రిటీల జ‌ర్నీ ఎలా ఆరంభ‌మైందో ఈ షో ద్వారా వెన్నెల కిషోర్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ షోలో ప‌లువురు టాలీవుడ్ యంగ్ హీరోల‌తో పాటుసెల‌బ్రిటీలు పాలు పంచుకోనున్న‌ట్లు స‌మాచారం. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్‌కి టాలీవుడ్​ యంగ్​ హీరో నిఖిల్‌, ఆయన సతీమణి డాక్టర్​ పల్లవి అతిథులుగా వచ్చి తమ ప్రేమ, పెళ్లి, కెరీర్​కి సంబంధించిన పలు విషయాలు పంచుకనునారు. ఈ ఎపిసోడ్​కి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. లాక్​డౌన్​ సమయంలో అతికొద్దిమంది బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ షోలో నిఖిల్​ తన భార్య పల్లవిని మొదటిసారి ఎక్కడ కలుసుకున్నదీ, వారి పరిచయం ఎలా జరిగింది, అది క్రమంగా ప్రేమ, పెళ్లివైపు ఎలా అడుగులేసిందీ పంచుకున్నారు. అంతేకాదు.. ఆ ప్రయాణంలో వారికి ఎదురైన సమస్యలు, ఇబ్బందులను కూడా పంచుకున్నారు. ఇక వారిద్దరినీ వెన్నెల కిషోర్​ అడిగిన ప్రశ్నలు, రాబట్టిన సమాధానాలు ఆధ్యంతం కార్యక్రమంపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కొన్ని సంవత్సరాలుగా ఈటీవీలో ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి బదులుగా అలా మొదలైంది షోని ప్రారంభించింది యాజమాన్యం. ఇక ఈ వారం నుంచీ ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పలువురు సెలబ్రిటీలు తమ విషయాలను పంచుకోనున్నారన్నమాట. వెండితెరతోపాటు వారం వారం తన చణుకులతో కిషోర్​ బుల్లితెర ప్రేక్షకులనూ అలరించనున్నారు.