Tapsee Pannu: ప్రియుడితో పెళ్లి.. షాకిచ్చిన తాప్సి..!

Tapsee Pannu: బాలీవుడ్ భామ తాప్సీ పన్ను.. పదేళ్లుగా డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో (Mathias Boe) ప్రేమలో ఉంది. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాగా వాటిపై తాప్సీ క్లారిటీ ఇచ్చింది.

సినీ పరిశ్రమలో హీరో లేదా హీరోయిన్ ప్రేమలో ఉన్నారని తెలిస్తే చాలు.. వారి పెళ్లి గురించి అనేక రూమర్స్ వైరల్ అవుతుంటాయి. అందుకే సినీ సెలబ్రిటీలు ఎక్కువశాతం వారి రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ తాప్సీ పన్ను అలా కాదు. తాను బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో ఉన్నట్టుగా అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో తాజాగా తనకు, మథియస్‌కు పెళ్లి ఫిక్స్ అయ్యిందని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారని కూడా రూమర్స్ వైరల్ అయ్యాయి. దానిపై తాప్సీ ఘాటుగా స్పందించింది. తనకు నచ్చిన విషయాల గురించి ముక్కుసూటిగా చెప్పేసే తాప్సీ.. పెళ్లి గురించి కూడా అలాగే వ్యాఖ్యలు చేసింది.

తాప్సీ, మథియస్.. మార్చిలో పెళ్లితో ఒక్కటవ్వనున్నారని బాలీవుడ్‌లో రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాప్సీ.. ఫైనల్‌గా స్పందించింది. ‘‘నేను నా పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఏ వివరణ ఇవ్వలేదు.. ఇకపై ఇవ్వను కూడా’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో తాప్సీ ఫ్యాన్స్ మరింత అయోమంలో పడ్డారు. అసలు తాప్సీ మాటలకు అర్థం తను పెళ్లి చేసుకుంటున్నట్టా? కాదా? అని చర్చలు మొదలుపెట్టారు. వివరణ ఇవ్వను అని చెప్పింది కానీ పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజమని చెప్పలేదు కదా అంటూ కొంతమంది ఫ్యాన్స్ లాజిక్స్ మాట్లాడుతున్నారు. దీంతో తాప్సీ పెళ్లి వార్తలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడలేదు.

2024 మార్చిలో తాప్సీ.. మథియస్‌ను వివాహం చేసుకుంటుందని, దీనికి బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎవరికీ ఆహ్వానం అందడం లేదంటూ వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఉదయ్‌పూర్‌లో పెళ్లికి ప్రణాళికలు జరుగుతున్నాయని, సిక్ క్రిస్టియన్ తరహాలో పెళ్లి జరగనుందని కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాజాగా బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ పెళ్లి హైలెట్‌గా మారింది. వీరిద్దరూ కూడా మూడేళ్ల క్రితం తమ రిలేషన్‌షిప్ గురించి అధికారికంగా ప్రకటించారు. అప్పటినుండి రకుల్, జాకీ పెళ్లి గురించి ఎన్నోసార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. తాప్సీ తరహాలోనే రకుల్ కూడా ఒకట్రెండు సార్లు ఈ రూమర్స్‌పై ఘాటుగా స్పందించింది. ఫైనల్‌గా తాజాగా జరిగిన వీరి పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మథియాస్ బో ఎవరు..?

మథియాస్ బో డెన్మార్క్‌కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అతను 2012 లండన్ ఒలింపిక్స్ మరియు 2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రజత పతకాలను గెలుచుకున్నాడు. ఆడటం నుండి రిటైర్ అయిన తర్వాత, అతను 2021లో భారతదేశపు పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జంట చిరాగ్ శెట్టి మరియు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డికి కోచ్ అయ్యాడు. బోయ్ కోచింగ్‌లో భారత ద్వయం విజయం సాధించింది, ఇండోనేషియా ఓపెన్, థామస్ కప్ మరియు పతకం వంటి ఈవెంట్‌లను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ జోడీ పురుషుల డబుల్స్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ర్యాంక్‌లో ఉంది.

ఇక తాప్సీ విషయానికొస్తే.. మథియస్‌తో తన రిలేషన్‌షిప్‌ను ఎప్పుడూ పెద్దగా సీక్రెట్‌గా మెయింటేయిన్ చేయలేదు ఈ భామ. కొన్ని రోజుల క్రితమే ‘‘నేను గత పదేళ్ల నుంచి ఒక్క మనిషితోనే ఉన్నాను. 13 ఏళ్ల క్రితం నేను యాక్టింగ్ ప్రారంభించాను. బాలీవుడ్‌లో నా డెబ్యూ సమయంలో తనను కలిశాను. అప్పటినుంచి ఇప్పటివరకు అదే వ్యక్తితో ఉన్నాను’’ అంటూ తన లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌గా ప్రకటించింది. ‘‘నాకు తనను వదిలేయాలని ఆలోచన లేదు. ఇంకొకరితో ఉండాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోనే నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని కూడా తేల్చిచెప్పింది. ఇప్పట్లో పెళ్లి కూడా చేసుకోను అని క్లారిటీ ఇచ్చింది.