RRR: నిర్మాత‌ను కావాలనే పక్కన పెడుతున్నారా?

Hyderabad: దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్​ఆర్​ఆర్(RRR)​. 450 కోట్ల భారీ బడ్జెట్​తో డి.వి.వి. దానయ్య(DVV Danayya) నిర్మించిన ఈ సినిమా సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఏకంగా ఆస్కార్(Oscar)​ను సైతం దక్కించుకుంది. అంతా బానే ఉన్నా ఈ సినిమా నిర్మాత దానయ్య ఈ అవార్డులు, సంబరాల్లో ఎక్కడా కనిపించకపోవడం చర్చకు దారితీస్తోంది. తాజాగా జరిగిన సన్మానోత్సవంలోనూ దానయ్య కనపడకపోవడంతో సోషల్​ మీడియా వేదికగా ఈ చర్చ మళ్లీ మొదలైంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ఎంతటి సంచలన విజ‌యాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్​ సైతం దక్కించుకుంది. అయితే `ఆర్ఆర్ఆర్‌` అంటే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి.. ఈ నాలుగు పేరులే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ నిర్మాత డి.వి.వి. దానయ్యను అందరూ మరిచిపోయారు. గోల్డెన్ గ్లోబ్‌ వేదికపేనే కాదు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, ఆస్కార్​ అవార్డ్స్ ఫంక్ష‌న్ లోనూ దానయ్య పేరును ప్రస్తావించలేదు. అయితే ఆస్కార్​ ప్రమోషన్స్​కు అయ్యే ఖర్చు దానయ్య పెట్టుకోకపోవడమే ఇందుకు కారణమనీ, రాజమౌళి కావాలనే దానయ్యను పక్కన పెట్టారని టాక్​. ఆస్కార్​ కోసం అయిన పూర్తి ఖర్చుని రాజమౌళితోపాటు నిర్మాత శోభు యార్లగడ్డ పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై దానయ్య మాట్లాడుతూ తననెవరూ సంప్రదించలేదు అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దానయ్య అలకకు ఆస్కార్​ ఖర్చు ఒక్కటే కారణం కాదంటూ ఓ కొత్త వాదన మొదలైంది. అసలు ఆర్​ఆర్​ఆర్​తో దానయ్యకు లాభం రాలేదని అందుకే ఈ సంబరాలకు దూరంగా ఉన్నారంటూ చర్చ జరుగుతోంది. మరి వీటిపై అటు ఆర్​ఆర్​ఆర్​ టీమ్​ గానీ, ఇటు దానయ్యగానీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.