Pushpa 2 చిత్రబృందానికి యాక్సిడెంట్​!

Hyderabad: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2(Pushpa2). క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్​కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ​ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. కాగా, ఈ సినిమాకు పనిచేస్తున్న ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి వద్ద పుష్ప-2 ఆర్టిస్టులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ఆర్టీసీ బస్సు ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో బన్ని సరసన హీరోయిన్​గా రష్మికా మందన్నా నటిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది.